
వేసవి శిబిరాలతో విద్యార్థులకు మేలు
వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా క్యాంపులో ఏం నేర్చుకుంటున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవుల్లో సెల్ఫోన్, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలన్నారు. వేసవి శిక్షణ శిబిరాలకు తమ పిల్లలను పంపించాలని కోరారు. ఆయన వెంట హెచ్ఎం సాంబయ్య ఉన్నారు.
రోడ్డెక్కిన అన్నదాత
వెల్దుర్తి(తూప్రాన్): పీఏసీఎస్ పాలకవర్గం నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని మండలంలోని కుకునూర్ రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. నెల రోజులుగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదంటూ వెల్దుర్తి–నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని అడిగితే హమాలీల కొరత ఉందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లిస్తుంటే, పాలకవర్గం తీరుతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుందని ఆరోపించారు. గురువారం కుకునూర్ కొనుగోలు కేంద్రంలో కాంటాలు ప్రారంభిస్తామని తహసీల్దార్ బాలలక్ష్మి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
వృద్ధుల పట్ల అలసత్వం వద్దు
నర్సాపూర్: వృద్ధులను పట్టించుకోకుండా అలసత్వం వహిస్తే వారి నుంచి సంక్రమించిన స్థిరాస్తులు తిరిగి వృద్ధులకే చెందుతాయని జూనియర్ సివిల్ జడ్జి హేమలత స్పష్టం చేశారు. బుధవారం స్థానిక డంగోరియా ఓల్డ్ ఏజ్ హోంలో చట్టాలపై అవగాహన కల్పించారు. వృద్ధుల పట్ల పిల్లలు అలసత్వం వహిస్తే సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం కన్న పిల్లలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఆశ్రమంలో ఉంటున్న బాధితుడు శ్రీశైలంతో జడ్జి మాట్లాడి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
వర్షాలతో అప్రమత్తంగా
ఉండాలి: ఆర్డీఓ
పాపన్నపేట(మెదక్)/టేక్మాల్: వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. వర్షాలు పడితే ధాన్యం తడిసిపోకుండా, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. త్వరగా కొనుగోళ్లు, రవాణా జరగాలని నిర్వామకునలు ఆదేశించారు. ఆమె వెంట ఎమ్మా ర్వో సతీష్ కుమార్, ఐకేపీ ఏపీఎం సాయిలు తదితరులు ఉన్నారు. అనంతరం టేక్మాల్లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తేమ శాతాన్ని పరీక్షించారు. తూకంలో తేడా లేకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులకు కలగకుండా చూడాలన్నారు.

వేసవి శిబిరాలతో విద్యార్థులకు మేలు