వేమనపల్లి: వేరే మండలాల నుంచి వడ్లు తీసుకువచ్చి వేమనపల్లి గోదాములో నింపుతుండ్రు.. మా వడ్లు ఎప్పుడు కొంటరు సార్.. అంటూ మార్కెట్ గోదాము వద్ద రైతులు 4 గంటల పాటు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలో పీఏసీఎస్, డీసీఎంఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. లారీలు రాక లోడింగ్ చేయక ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. చెన్నూర్, ఇతర మండలాల నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం లారీల్లో తీసుకువచ్చి వేమనపల్లి గోదాముల్లో నింపుతున్నారు. మండలంలోని ధాన్యం వీలైతే ఇక్కడి గోదాంలోనే నింపాలని డిమాండ్ చేశారు. గోదాము వద్ద వడ్ల లోడుతో ఉన్న లారీలను అన్లోడ్ చేయకుండా అడ్డుకున్నారు. డీటీ సాయికృష్ణ, ఎస్సై జగదీష్రెడ్డి, ఎంఏవో వీరన్న, ఆర్ఐ ఖాలిక్ ఉన్నతాధికారులతో మాట్లాడి ధాన్యం తరలించేందుకు లారీలు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.


