కార్మికుల ఆందోళన
మంచిర్యాలఅర్బన్: బ్రీత్ అనలైజర్ పరికరంలో లోపాలు, వివక్ష చూపుతున్నారంటూ సోమవారం మంచిర్యాల డిపో కార్మికులు మెరుపు సమ్మె చేపట్టారు. మద్యం తాగకున్నా తాగినట్లు నిర్ధారించడాన్ని నిరసిస్తూ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డ్రైవర్ తన కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులతో తెల్లవారుజామున డిపో గేటు ఎదుట బైఠాయించారు. 151 మంది డ్రైవర్లు, 199 మంది కండక్టర్లు సంఘీభావంగా విధులకు గైర్హాజరు కావడంతో 148 బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. డ్రైవర్ రాయమల్లుకు ఈ నెల 8న ఉదయం 7గంటలకు సెక్యూరిటీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా 57 వచ్చినట్లు నిర్ధారించారు. రెండోసారి పరీక్షలకు సెక్యూరిటీ నిరాకరించారని రాయమల్లు ఆరోపించారు. మరోసటి రోజు ఓ కార్మికుడికి పరీక్షలో 73 ఎంజీ రీడింగ్ వచ్చినా విధుల్లోకి తీసుకుని తనపై చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఆదివారం రాత్రి నైట్హాల్ట్ వెళ్లిన బస్సులన్నీ ధర్నాతో బస్టాండ్ నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు బారులు తీరాయి. గోదావరిఖని, జగిత్యాల, ఇతర డిపోల బస్సులు బస్టాండ్కు రాకుండా ఐబీ చౌరస్తా నుంచి వెనుదిరిగాయి. పోలీసులు, ఆర్టీసీ అధికారులు సర్దిచెప్పినా ఆందోళన విరమించకపోవడంతో సీఐ ప్రమోద్రావు నేతృత్వంలో ఆందోళనకారులను తొలగించారు. రాయమల్లును పోలీసుస్టేషన్కు తరలించారు. మెరుపు సమ్మెతో డిపోకు దాదాపు రూ. 15లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
చర్చలు సఫలంతో బస్సుల రాకపోకలు..
డిపోలో ఉదయం 3.45 నుంచి నిలిచిపోయిన బస్సులు సాయంత్రం 5.45 గంటల తర్వాత రాకపోకలు సాగించాయి. ఆదిలాబాద్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం(ఓ) శ్రీహర్ష, డీఎం శ్రీనివాసులు జేఏసీ నేతలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో బస్సుల రాకపోకలు కొనసాగాయి. బ్రీత్ అనలైజర్ పరికరాన్ని పరీక్షకు పంపించి మిషన్ లోపం అని తేలితే కార్మికునిపై చర్యలు తీసుకోకుండా విధులకు పంపించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రిపోర్టు వచ్చే వరకు కార్మికునిపై ఎలాంటి చర్యలు ఉండవని అంగీకారం కుదరడంతో కార్మికులు విధులకు హాజరయ్యారు.


