ఇష్టారాజ్యంగా మందుల విక్రయాలు
ప్రిస్కిప్షన్, బిల్లులు లేకుండానే అమ్మకాలు
మెడికల్ షాపుల యజమానుల ఇష్టారాజ్యం
మూసే ఉంటున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం
మెడికల్ షాపు నిర్వహించేందుకు బీ ఫార్మసి/ఎం ఫార్మసి పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. షాపుల అనుమతుల కోసం సంబంధిత ఫార్మాసిస్టుల సర్టిఫికెట్లతో పాటు, వ్యక్తిగత గుర్తింపు కార్డు, చిరునామా వంటి వివరాలతో డ్రగ్ ఇన్స్పెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత అధికారులు పరిశీలించి అనుమతులు ఇచ్చిన తరువాతే షాపులు ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ అనుమతుల సమయంలో ఫార్మాసిస్టుల ధ్రువీకరణ పత్రాలను పెట్టి, షాపు ప్రారంభించిన తరువాత ఫార్మాసిస్టులు లేకుండానే కొందరు మందులు విక్రయిస్తున్నారు. ఫార్మాసిస్టుల పర్యవేక్షణ ఉండాల్సి ఉండగా, అవేం లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు వారి ప్రాథమిక చికిత్స కేంద్రం వద్దనే ఇతరుల పేరిట మెడికల్ షాపు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు.
మంచిర్యాలటౌన్: జిల్లాలోని మెడికల్ దుకాణాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా, వాటిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ప్రజలు ఆరోగ్య సమస్య ఏదైనా సరే వెంటనే మెడికల్ షాపునకు వెళ్లి, సమస్యను చెప్పి నిర్వాహకులు ఇచ్చిన మాత్రలు తెచ్చుకుంటున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్తో సంబంధం లేకుండా యాంటిబయాటిక్స్ మందులు సైతం అందిస్తున్నారు. జబ్బు నయం కాని పక్షంలో ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదిస్తున్నారు. మెడికల్ దుకాణాల్లో ఇచ్చే మందులతో అప్పటికప్పుడు జబ్బు తగ్గినా, దీర్ఘకాలికంగా దుష్పరిణామాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా షెడ్యూల్ హెచ్, హెచ్ 1 మందులను అమ్మేందుకు వీలు లేదు. ఆ మేరకు రికార్డులు కూడా నిర్వహించి, బి ల్లుల నిర్వహణ కూడా ఉండాలి. గడువు ముగిసిన మందులను షాపుల్లో ఉంచడం, అమ్మడం చేయవద్దు. జిల్లాలో దాదాపుగా 600లకు పైగా మెడికల్ షాపులు నిర్వహిస్తుండగా, ఇందులో చాలా షాపుల్లో నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. ఔషధ నియంత్రణ, వాటి నాణ్యతా ప్రమాణాలను డ్రగ్ ఇన్స్పెక్టర్లే చూడాల్సి ఉంటుంది.
ఇష్టారీతిన అమ్మకాలు
జిల్లాలోని కొన్ని మెడికల్ షాపుల్లో ఎమ్మార్పీపై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తామని ప్రకటిస్తుండడంతో వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్తో ఆయా మెడికల్ షాపులకు వెళ్తున్నారు. నిర్వాహకులకు డాక్టర్లు రాసే మందులు అర్థం కాకున్నా, వారికి అర్థమైన వాటిని అందిస్తున్నారు. దీంతో వైద్యులు సూచించే మందులు ఒకటైతే వారు ఇచ్చే మందులు వేరేగా ఉంటున్నా యి. కొన్ని షాపుల్లో శాంపిల్స్గా ఇచ్చిన మందులను అమాయకులకు కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. శాంపిల్, నాణ్యతలేని మందులను రోగులకు అంటగడుతూ అందినకాడికి దండుకుంటున్నట్లు సమాచారం. మందులు కొనుగోలు చేస్తే ఎంతవుతుందో లెక్క వేసి డబ్బులు తీసుకుంటుండగా, ఏ మందు ఎంత ధరకు అమ్ముతున్నారనే విషయాన్ని కొనుగోలుదారులకు చెప్పడం లేదు. కొన్న మందులకు బిల్లులు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నా రు. కొన్ని మెడికల్ దుకాణాల్లో మాత్రమే మందుల వివరాలతో కూడిన బిల్లులు ఇస్తున్నారు. డాక్టర్ల సూచనల మేరకు యాంటిబయాటిక్ మందులను అమ్మాల్సి ఉండగా, అలాంటివేం పట్టించుకోకుండానే ప్రజల కు మందులు అమ్ముతున్నారు. యాంటిబయాటిక్ మందులను ఇష్టారీతిన వాడితే సైడ్ ఎఫెక్ట్స్తో కొత్త జబ్బుల బారిన పడే ప్రమాదం ఉన్నా దుకాణదారులు అవేం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


