శ్రీరాంపూర్: సింగరేణిలో కారుణ్య నియామకాలపై ఏసీబీ విచారణ జరిపిస్తే సమ్మె చేస్తామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య యజమాన్యాన్ని హెచ్చరించారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ బోర్డులో అవినీతి జరిగిందనే సాకుతో కారుణ్య ఉద్యోగాలు పొందిన వారిపై విచారణ చేస్తామని డిప్యూటీ సీఎం అసెంబ్లీలో ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఓబీల్లో ఎక్సెస్ టెండర్లు వేసిన కాంట్రాక్ట్ సంస్థలపై చర్య తీసుకోవాలన్నారు. గత ఆర్థిక సంవత్సరం 63 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే అదనంగా మరో 6 మిలియన్ టన్నులు తప్పుడు లెక్కలు చూపిన అధికారులపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సంస్థ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని కార్మికులకు వేతనాలు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేవన్నారు. ఈ స్థితికి కారణమైన వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్రావు నాయకులు నర్సింగరావు, సదానందం, జీవీ రావు, రాజ్కుమార్, చిలక రమేశ్, తదితరులు పాల్గొన్నారు.


