మృత్యువులోనూ వీడని స్నేహం
పనికోసం వెళ్లి.. కానరాని లోకాలకు ముగ్గురిని కబళించిన రోడ్డు ప్రమాదం ఇంటి పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడ్డ వైనం కన్నీరుమున్నీరైన కుటుంబీకులు
సాత్నాల: చిన్ననాటి నుంచి వారు మంచి స్నేహితులు.. ఏ పని చేయాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా కలిసే వెళ్తుంటారు.. వారి స్నేహాన్ని చూసి స్నేహం అంటే ఇలా ఉండాలని అందరూ చెప్పుకునేవారు.. మృత్యువులోనూ వీరి స్నేహబంధం వీడలేదు.. రోడ్డు ప్రమాదం వీరిని కబళించింది.. కానరాని లోకాలకు తీసుకెళ్లడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రెండు నెలల క్రితమే పెళ్లి జరిగిన ఓ ఇంట్లో తీరనిశోకం మిగిలింది. నవ వధువు రోధించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వీరిది. కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అతివేగం వీరి పాలిట శాపంగా మారింది. భోరజ్ మండలంలోని తర్ణం వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతిచెందగా, ఒకరు తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డారు. సీఐ శ్రావణ్కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
అసలేం జరిగింది?
ఆదిలాబాద్లోని జైజవాన్నగర్కు చెందిన నలుగు రు స్నేహితులు భవన నిర్మాణ పనులు చేస్తూ జీవ నం సాగిస్తున్నారు. వీరిలో కీర్తి సాగర్ (29) రాడ్వైండింగ్, షేక్ మోసిన్ (26) పీఓపీ పనిచేస్తుండగా షేక్ మోహినుద్దీన్ (27) ఇంటి వద్దే ఉండేవాడు. యోగేష్ కటేకర్ పెయింటర్. ఈ నలుగురూ మంగళవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఆదిలా బాద్ నుంచి కారులో మహారాష్ట్రలోని వణికి పనికో సం వెళ్లారు. అదేరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణంలో జైనథ్ వద్ద ధాబాలో భోజనం చేసి ఇంటిబాటపట్టారు. రాత్రి 11:30 గంటల సమయంలో భోరజ్ మండలం తర్ణం మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ముగ్గురు ఘటన స్థలంలోనే మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.
మిత్రుల ప్రాణాలు కాపాడేందుకు..
నలుగురిలో మోహినుద్దీన్ కారు డ్రైవింగ్ చేశాడు. చెట్టును ఢీకొట్టడంతో వాహనం బోల్తా పడింది. ముగ్గురు అందులోనే ఇరుక్కున్నారు. గాయాలతో బయటపడిన యోగేష్ మిత్రుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్డుపైకి వచ్చి సహాయం కోరాడు. అటుగా వెళ్తున్న వారు వచ్చి చూడగా అప్పటికే ముగ్గురు తుదిశ్వాస విడిచారు. స్థానికుల ఫోన్తో కుటుంబీకులకు, 108కు సమాచారం అందించాడు. క్షతగాత్రుడితో పాటు మృతదేహాలను 108లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రి 12 గంటల ప్రాంతంలో రిమ్స్కు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉండగా కీర్తి సాగర్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మోహినుద్దీన్కు 60 రోజుల క్రితమే వివాహమైంది. యోగేష్ వివాహంకాగా భార్యతో విడాకులయ్యాయి. షేక్ మోసిన్కు వివాహం జరిగింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, ఆయా పార్టీల నాయకులు రిమ్స్కు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృత్యువులోనూ వీడని స్నేహం
మృత్యువులోనూ వీడని స్నేహం
మృత్యువులోనూ వీడని స్నేహం


