ఇంటి నుంచి ఓటు లేనట్లే!
నిర్మల్చైన్గేట్: రెండేళ్లక్రితం జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం మంచానికే పరిమితమైన వృద్ధులు, నడవలేని, దివ్యాంగులు ఇంటివద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. కానీ ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అలాంటి అవకాశం ఇవ్వలేదు. దివ్యాంగులు, వృద్ధులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా ఎన్నికల సంఘం నుంచి అలాంటి ప్రకటన ఏదీ రాలేదు.
గత ఎన్నికల్లో 12–డీ ఫారం ద్వారా..
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు జాబితాలో పేరుండి 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 45 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి నుంచే ఓటుహక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా 12–డీ ఫారాన్ని ముందస్తుగానే నింపి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అధికారులు వారు ఇచ్చిన అడ్రస్ కు పూర్తిస్థాయి భద్రతతో పోలింగ్ సామగ్రితో వెళ్లి ఓటు వేయించారు.
గెలుపోటములపై ప్రభావం..
వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచి ఓటువేసే అవకాశం లేకపోవడంతో కచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ సమయం కూడా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది. నిర్ణీత సమయం లోపు కుటుంబ సభ్యులు వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించాల్సి ఉంటుంది. కాదూ అని వారిని వదిలేస్తే ఓటింగ్ శాతం తగ్గి గెలుపు, ఓటములపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. కాగా ఇంటినుంచి ఓటుహక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని నిర్మల్ డీపీవో శ్రీనివాస్ తెలిపారు.
ఇంటి నుంచి ఓటు లేనట్లే!


