ఆర్టీఏ అవినీతికి చెక్‌ ! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ అవినీతికి చెక్‌ !

Oct 23 2025 6:25 AM | Updated on Oct 23 2025 6:25 AM

ఆర్టీఏ అవినీతికి చెక్‌ !

ఆర్టీఏ అవినీతికి చెక్‌ !

● ఉమ్మడి జిల్లాలో చెక్‌పోస్టుల ఎత్తివేత ● కార్యాలయాల్లోనూ ఏజెంట్లను నిలువరిస్తే మేలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రవాణా శాఖలో అక్రమాలకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది. రాష్ట్రంలో రవాణా శాఖ చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న తనిఖీ కేంద్రాలను బుధవారం సాయంత్రం నుంచే అమలు చేశారు. ఉమ్మడి జిల్లాలో అంతర్రాష్ట్ర సరి హద్దుగా జాతీయ రహదారులు–44, 61, 363పై జైనథ్‌ మండలం భోరజ్‌, తానూర్‌ మండలం బెల్‌తరోడ, వాంకిడిలోని చెక్‌పోస్టులు పూర్తిగా తొలగించారు. మూడు నెలల క్రితమే రవాణా శాఖలో తని ఖీ కేంద్రాలను ఎత్తి వేసి పూర్తిగా ఆన్‌లైన్‌ ఆధారిత వాహన పన్నుల వసూళ్లు, జరిమానాలు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా చెక్‌పోస్టులు అనధికారికంగానే కొనసాగుతూ వస్తున్నా యి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో లెక్కకు మించి ఉన్న రూ.1.26లక్షల నగదు భోరజ్‌ వద్ద, రూ.5,100 వాంకిడి చెక్‌పోస్టు వద్ద, బెల్‌తరోడ చెక్‌పోస్టు వద్ద రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఇవే చెక్‌పోస్టుల్లో దాడులు జరుగగా.. అనధికారికంగా వసూలు చేసిన సొమ్మును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. తరచూ దాడులు, తనిఖీలు జరిగినా ఈ కేంద్రాల్లో సాగిన అవినీతిని నిలువరించలేకపోయారు. మరోవైపు ప్రభుత్వానికి పన్నుల లక్ష్యాలు పూర్తి స్థాయిలో చేరడం లేదు. తాజాగా కేంద్రాలను ఎత్తివేయడంతో వాహన యజమానులు, డ్రైవర్ల నుంచి అనధికార వసూళ్లు పూర్తిగా తగ్గనుంది.

బెల్‌తరోడాలో..

తానూరు: బెల్‌తరోడా చెక్‌పోస్టులోని ఫర్నిచర్‌ను నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయానికి తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అధికారులు, సిబ్బంది ఫర్నిచర్‌తోపాటు కంప్యూటర్లు, ఫైళ్లు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. చెక్‌పోస్ట్‌ను ఎత్తివేసినట్లు బ్యానర్‌ ఏర్పాటు చేశారు.

ఫైళ్లు తరలింపు..

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా అధికారులు ఆఘమేఘాలపై బోరజ్‌ చెక్‌పోస్టు వద్ద కార్యకలాపాలు నిలిపి వేశారు. బోర్డులు, బారికేడ్లు తొలగించారు. కంప్యూటర్లు, రశీదులు, ఆర్థిక పరిపరమైన రికార్డులను డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయాని(డీటీసీ)కి తరలించారు. నలుగురు ఎంవీఐలు, ఆరుగురు ఏఎంవీఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులు, ముగ్గురు కార్యాలయ సిబ్బంది పని చేస్తున్నారు. వీరు మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే వారు. వీరిని డీటీసీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇక నుంచి వీరికి ఇతర బాధ్యతలు అప్పగించనున్నారు.

కార్యాలయాల్లో ఏజెంట్ల హవా

ఆన్‌లైన్‌లో సేవలు..

వాంకిడి: చెక్‌పోస్టుల ద్వారా అందించిన సేవలను ఇకపై www. transport. telangana. gov. in వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ అనే ఆప్షన్‌ ద్వారా టెంపరరీ పర్మిట్‌, వాలంటరీ టాక్స్‌, స్పెషల్‌ పర్మిట్‌ వంటి సేవలు లభ్యమవుతాయి. సేవలపై చెక్‌పోస్ట్‌ సిబ్బంది కొన్ని నెలలుగా వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు చెక్‌పోస్టు వద్ద ప్రత్యేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌ జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లోనూ ఏజెంట్లు, మధ్యవర్తల హవా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. ఏజెంట్ల పేరుతో వాస్తవ చార్జీల కంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అంతా తెలిసి కూడా ఈ అనధికార వసూళ్లను ప్రోత్సహిస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే వాహనదారులు, వినియోగదారులు లైసెన్స్‌, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు ఇవ్వడంలో ప్రభుత్వం విధించిన రుసుం, పన్నుల కంటే అధికంగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోంది. చాలామందికి రవాణా శాఖ నిబంధనలపై అవగాహన లేమితో విద్యావంతులు సైతం మధ్యవర్తులతోనే కార్యాలయాలకు వెళ్తున్నారు. చాలా సేవలు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. సులువుగా పని పూర్తవుతుందనే కారణంతో ఏజెంట్లను ఆశ్రయిస్తున్న పౌరులపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్లు షోరూంల్లోనే చేసుకునే వెలుసుబాటు ఇవ్వాలి. నిరక్షరాస్యులు సైతం కార్యాలయాల్లో సేవలు పొందేలా ఏర్పాట్లు, కార్యాలయాల్లో మధ్యవర్తులను కట్టడి చేస్తే అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆధారిత ఆధునిక సేవలను వినియోగించి దళారుల వ్యవస్థను తగ్గిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ పేర్కొన్న నేపథ్యంలో ఆ దిశగా ఉమ్మడి జిల్లా కార్యాలయాల్లో పకడ్బందీగా అమలు చేస్తే అక్రమ వసూళ్లు నిలిచే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement