
స్నేహితుల సన్మాన పండుగ
లక్ష్మణచాంద: మహిళలకు తామేమి తక్కువ కాదన్నట్లుగా మగవాళ్లు కూడా ఈ మధ్యన స్నేహితుల సన్మానం పండుగ జరుపుకుంటున్నారు. మండలంలోని కనకాపూర్కు చెందిన 24 మంది యువకులు ఇటీవల జరుపుకోగా గురువారం పీచర గ్రామానికి చెందిన 14 మంది యువకులు వ్యవసాయ క్షేత్రంలో శాలువాలతో ఒకరినొకరు సన్మానించుకుని స్వీట్లు తినిపించుకున్నారు. తమ స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకున్నారు.
డమ్మీ తుపాకీతో హల్చల్ చేసినవారిపై కేసు
నిర్మల్టౌన్: పట్టణంలో ఈనెల 7న జరిగిన గణేశ్ నిమజ్జనం సందర్భంగా డమ్మీ తుపాకీ పట్టుకుని డ్యాన్స్ చేసి హల్చల్ చేసినవారిపై గురువారం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..స్థానిక నాయుడువాడలో భాగ్యనగర్ కాలనీకి చెందిన భక్తాంజనేయ గణేశ్మండలి విగ్రహం ముందు రంజిత్తోపాటు మరికొందరు డమ్మీ తుపాకీ పట్టుకుని డ్యాన్స్ చేస్తూ.. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. చుట్టుపక్కల ఉన్నవారిని, నిమజ్జన శోభాయాత్రలో భక్తులను భయంభ్రాంతులకు గురిచేశారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ఆపాలని చెప్పిన వినకుండా వారి విధులకు ఆటంకం కలిగిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
తలమడుగు: హైదరాబాద్ జింఖానా గ్రౌండ్లో ఈనెల 9, 10వ తేదీల్లో 200 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ ఎంపిక పోటీల్లో సుంకిడి ఉన్నత పాఠశాల పీడీ జి.నాందేవ్ సత్తాచాటి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు నవంబర్లో జరగనున్నాయి. హెచ్ఎం జైవర్ధన్రెడ్డి, ఉపాధ్యాయులు టి.శ్రీనివాస్ స్వామి, బి.గజానంద్, వై.రామ్రెడ్డి, పి.సుకుమార్, జి.సుజాత, సి.శ్రీనివాస్రెడ్డి, సంజీవరెడ్డి గురువారం ఆయన్ను అభినందించి సన్మానించారు.
రేషన్బియ్యం పట్టివేత
సిర్పూర్(టి): మండలంలోని వెంకట్రావ్పేట్ సమీపంలో రైస్మిల్లులో తహసీల్దార్ రహీమొద్దిన్, ఎస్సై కమలాకర్ గురువారం అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ నిర్వహించారు. సుమారు 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు. పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

స్నేహితుల సన్మాన పండుగ

స్నేహితుల సన్మాన పండుగ