
ఇటీవల ఓ వ్యక్తి తన తండ్రి చనిపోతే పట్టా మార్పిడి విరాసత
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో కొందరు అధికారుల తీరు డబ్బులిస్తేనే పని చేస్తామన్నట్లుగా మారింది. మరికొందరు నిజాయతీగా విధులు నిర్వర్తిస్తున్నారు. చాలామంది ప్రభుత్వ అధికారులు సర్కారు జీతంతోపాటు అవినీతికి మరిగి జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో పోలీసు శాఖలో ఓ ఎస్సై, రెవెన్యూ మండల సర్వేయర్ పట్టుబడగా.. తాజాగా శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు లేబర్ ఆఫీసర్లు రూ.లక్షలు లంచం డిమాండ్ చేసి చివరకు రూ.వేలల్లో బేరం కుదుర్చుకుని ఏసీబీ అధికారులకు చిక్కారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్న ఆయా శాఖల్లో ఈ తంతు అధికంగా ఉంటోంది. వసతిగృహాల్లో విద్యార్థులకు అందే భోజనం నుంచి రూ.కోట్ల అభివృద్ధి పనులు వరకూ లంచాల పర్వం సాగుతోంది. విద్యుత్ శాఖలోనూ పనుల కోసం వసూళ్లు జరుగుతున్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో సహా పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతుల కోసం ముడుపులు ఇచ్చుకోవాల్సి వస్తోంది.
నేరుగా ‘సాక్షి’ కెమెరాకు చిక్కి..
గత నెలలో సాక్షాత్తు జిల్లా కలెక్టరేట్లోనే ఉన్న కార్మిక శాఖ కార్యాలయ సిబ్బంది ఒకరు డబ్బులు వసూలు చేస్తూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. కార్యాలయం పక్కనే ఉన్న బాత్రూంలో కార్మిక కుటుంబానికి చెందిన ఓ యువకుడి నుంచి నగదు తీసుకుంటూ కనిపించారు. ఫొటోలు తీస్తుండగానే తాము డబ్బులు తీసుకోలేదని తాజాగా పట్టుబడిన అధికారే బుకాయించారు. నిరుపేద కార్మికుల కుటుంబాల నుంచీ డబ్బులకు తెగబడ్డారంటే ఆ శాఖలో కక్కుర్తి అర్థమవుతోంది.
● అప్పట్లో ఓ ఉన్నతాధికారి నేరుగా తన చాంబర్లో టేబుల్ డ్రా ఓపెన్ చేసి పెట్టేవారు. ఆ డ్రాలో రూ.వేల కొద్దీ డబ్బులు వేసి వచ్చేవాళ్లు. ఆయన చాంబర్లో సీసీ కెమెరా లేకపోవడం ఆయన అదృష్టం. ప్రస్తుతం జిల్లాలో ఆ అధికారి లేరు.
● పౌరసరఫరాల శాఖలో కొంతమంది అధికారులకు బియ్యం వ్యాపారుల నుంచి నెల నెలా మామూళ్లు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్ డీలర్లపై 6ఏ కేసు నమోదైతే విచారణ నుంచి మొదలు కేసు పూర్తయ్యే దాకా ఆ రేషన్ డీలరుకు పైస ఖర్చు కావాల్సిందే. దొడ్డు బియ్యం సమయంలో ఈ దందా అధికంగా ఉండేది. రైస్మిల్లు తనిఖీలు, సీఎంఆర్ అనుమతి, రికవరీ తదితర వాటిల్లోనూ వసూళ్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
● రవాణా శాఖలో లైసెన్స్ నుంచి రిజిస్ట్రేషన్, పర్మిట్లు, ఇతర ఏ సేవకై నా మధ్యవర్తులతో వెళ్తేనే పని అవుతోంది. నేరుగా వెళ్తే అధికారులు, సిబ్బంది అర్జీదారుడిపై చిరాకు పడుతూ పని చేసేందుకు అస్సలు ఇష్టపడడం లేదు. దీంతో మధ్యవర్తులతో వాస్తవ ఫీజుల కంటే అధికంగా ఇస్తే సులువుగా పనవుతుందనే భావన ఉంది.
● జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్న మంచిర్యాల, లక్సెట్టిపేటలో దళారులు, మధ్యవర్తుల హవానే నడుస్తోంది. ఇటీవల ఒకరు తమ భూమి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ ఏసీబీని ఆశ్రయించారంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఆ రోజు ఉదయమంతా అప్రమత్తంగా ఉన్నారు.
● తహసీల్దార్ ఆఫీసుల్లోనూ అక్రమాలు ఆగడం లేదు. నెన్నెలలో ఓ తహసీల్దార్ పైసల ఆశకు బతికున్నా చనిపోయినట్లు సృష్టించి పట్టా మార్పిడి చేసి సస్పెండైన విషయం తెలిసిందే. ఇక గుంటల చొప్పున ఓపెన్ ప్లాట్లు వ్యవసాయ రిజిస్ట్రేషన్లు చేయొద్దని చెబుతున్నా ఓ మండలంలో తహసీల్దార్ ఒక్కో రిజిస్ట్రేషన్కు రేట్ ఫిక్స్ చేసుకున్నారు. నేరుగా తనే రూ.వేలల్లో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అన్ని మండలాల నుంచి ఒకటో రెండో జరుగుతున్నా ఆ మండలం నుంచి మాత్రం పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా పట్టించుకునే పై అధికారే లేరంటే ఆశ్చర్యం కలగమానదు.
● అభివృద్ధి, సంక్షేమ పనులు చేస్తున్న చాలామంది కాంట్రాక్టర్ల బిల్లుల్లో పర్సంటేజ్ ఇవ్వకపోతే అధికారులు మంజూరులో ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఎక్కడ అందాల్సినవి ఆ స్థాయిలో ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ విభాగాలతోపాటు బిల్లులు చెల్లించే ట్రెజరీలోనూ ఈ తంతు నడుస్తోంది.
వసూళ్లకు ప్రత్యేక సిబ్బంది!
బెల్లంపల్లి: బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ అధికారి(ఏఎల్ఓ) కార్యాలయం అవినీతిమయంగా మారింది. ఏ చిన్న పని జరగాలన్నా లంచం ముట్టజెప్పాల్సి వస్తోంది. ఏకంగా ఇక్కడ వసూళ్లకు ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవడం గమనార్హం. శుక్రవారం ఏసీబీకి చిక్కిన బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ అధికారి పాక సుకన్య డబ్బుల వసూలుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ప్రభుత్వ నిబంధనలు పక్కనబెట్టి మోకెనపల్లి రాజేశ్వరి అనే మహిళను అసిస్టెంట్గా నియమించుకుంది. ఆమెతోపాటు మరో ఇద్దరు ముగ్గురు అనధికారికంగా అసిస్టెంట్లుగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి ద్వారా లంచాలు తీసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. అడిగినంత డబ్బు ముట్టనిదే ఏ పనీ చేయరనే ఆరోపణలున్నాయి.
లేబర్కార్డు రెన్యూవల్ కావాలన్నా..
అసంఘటిత రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తోంది. ఇందుకు కార్మికులు కార్మిక శాఖ నుంచి లేబర్కార్డు పొందాల్సి ఉంటుంది. ఆ కార్డు ప్రాతిపదికనే లబ్ధి చేకూరుతుంది. ఈ కార్డు రెన్యూవల్ చేసుకోవాలన్నా ముడుపులు ముట్టజెప్పాల్సిందేననే ఆరోపణలున్నాయి. కార్మికుల కూతురు పెళ్లి, ప్రసవానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. ఇందులోనూ వాటా వసూలు చేస్తారని తెలుస్తోంది. ప్రమాదవశాత్తు, సహజ మరణాలకు అందే పరిహారంలోనూ లంచం ఇవ్వాల్సిందేనే చర్చ జరుగుతోంది. తాజాగా నరాల శంకర్ అనే కార్మికుడు చనిపోతే పరిహారం మంజూరు చేసే ఫైల్ అప్రూవల్కు రూ.40వేలు డిమాండ్ చేసి తన అసిస్టెంట్ ద్వారా రూ.30వేలు తీసుకుని సుకన్య ఏసీబీ అధికారులకు చిక్కారు.
నేరుగా ఫిర్యాదు చేయండి
ఉమ్మడి జిల్లా ఏసీబీ కార్యాలయం నస్పూర్లోనే ఏర్పాటు కావడంతో ఎవరైనా అధికారి లంచం అడిగితే నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది లంచావతారులు జైలు పాలయ్యారు. జిల్లాలో అవినీతికి పాల్పడే అధికారుల ఆట కట్టించాలంటే ఏసీబీ అధికారుల వాట్సాప్ నంబరు 9440446106, టోల్ఫ్రీ 1064కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఎవరి స్థాయిలో వారు వసూళ్ల పర్వం
అవినీతికి మరిగిన కొందరు అధికారులు
విధుల నిర్వహణకూ డబ్బులివ్వాల్సిందేనా..?
ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న అవినీతిపరులు
ఏసీబీకి పట్టుబడిన లేబర్ ఆఫీసర్ కాటం రామ్మోహన్
సాక్షిలో ప్రచురితమైన కథనాలు

ఇటీవల ఓ వ్యక్తి తన తండ్రి చనిపోతే పట్టా మార్పిడి విరాసత

ఇటీవల ఓ వ్యక్తి తన తండ్రి చనిపోతే పట్టా మార్పిడి విరాసత

ఇటీవల ఓ వ్యక్తి తన తండ్రి చనిపోతే పట్టా మార్పిడి విరాసత

ఇటీవల ఓ వ్యక్తి తన తండ్రి చనిపోతే పట్టా మార్పిడి విరాసత