
మానవ అక్రమ రవాణా ముఠా అరెస్ట్
● ముగ్గురిపై కేసు నమోదు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి
ఆదిలాబాద్టౌన్: మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. భీంపూర్ మండలానికి చెందిన ఓ బాలిక బంధువుల ఇంట్లో ఉంటూ పదోతరగతి చదువుతోంది. ఈ నెల 2న ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ఘంటంజీ తాలుకా కిన్హి గ్రామానికి చెందిన భార్యాభర్తలు నిర్మల బాపూణ్య ఆత్రం, బాపూణ్య రాజారాం ఆత్రం బాలిక ఇంటికి వచ్చారు. కిన్హిలో ఓ కార్యక్రమం ఉందని మాయమాటలు చెప్పి ఆదిలాబాద్కు తీసుకొచ్చారు. బస్సులో నాగ్పూర్కు తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి రైలులో రాజస్థాన్లోని కోటాకు తీసుకెళ్లి కరణ్ అలియాస్ భగవత్ మీనన్కు అప్పగించారు. అతని వద్ద నుంచి రూ.10వేలు తీసుకున్నారు. కరణ్ బాలికను తన ఇంట్లో అక్రమంగా నిర్బంధించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి బంధువులు ఈ నెల 22న భీంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు ఆ బాలికను రైలులో ఆదిలాబాద్కు తీసుకురాగా 25న ఇంటికి చేరుకుంది. నిందితులు శనివారం రైలుమార్గంలో ఆదిలా బాద్ నుంచి పారిపోతుండగా రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్తో పాటు రూ.2వేల నగదును స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో జైనథ్ సీఐ డి.సాయినాథ్, భీంపూర్ ఎస్సై బి.పీర్ సింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.