
బాసరలో సీసీ కెమెరాలు ధ్వంసం
బాసర: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. పీఎంశ్రీ పథకం కింద ఏర్పాటు చేసిన నాలుగు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి రెండింటిని ఎత్తుకెళ్లారు. శనివారం ప్రధానోపాధ్యాయుడు నరసయ్య పాఠశాలను తెరిచే సరికి సీసీ కెమెరాలు చిందరవందరంగా ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు. గతంలో సైతం పాఠశాల ప్రాంగణంలోకి చొరబడి దుశ్చర్యలకు పాల్పడ్డారని, అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాల అడ్డాగా మా రిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పాఠశాలకు రాత్రిపూట భద్రత కరువైందని ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
హీరాసుక్క ఆశయ సాధనకు కృషి
బజార్హత్నూర్: ఆదివాసీల ఆరాధ్య దైవం, ఆదివాసీల గోండి ధర్మ గురువు హీరాసుక్క ఆశయ సాధనకు కృషి చేస్తామని పర్ధాన్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్వ నాగేశ్వర్ అన్నారు. శనివారం మండలంలోని యేసాపూర్లో హీరాసుక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఉయికే సుదర్శన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సిడం కిషన్, ఐటీడీఏ పీవీటీజీ అధ్యక్షుడు మేస్రం మనోహర్, కౌడుజీ, మడావి నరహరి, నర్సయ్య, పాండురంగ్, కొడప నగేష్, నైతం రమేష్, ఉత్తం, శ్రీరాం, తదితరులు పాల్గొన్నారు.