
అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ఊరుకోం
● నిధులు దుర్వినియోగం చేస్తున్న పీవోను బదిలీ చేయాలి ● ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం అధ్యక్షుడు సోనేరావు
ఆదిలాబాద్అర్బన్: పీవీటీజీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ నిధులు సక్రమంగా వినియోగించకుండా దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొడప సోనేరావు అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీ కొలాం, తోటి, చెంచు, కొండరెడ్ల నిధులు దుర్విని యోగం చేస్తున్న ఐటీడీఏ పీవోను బదిలీ చేయాలని కలెక్టర్ను కోరామన్నారు. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించకుండా వైద్యారోగ్యం, పౌష్టికాహారంపై గిరిజన పల్లెలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పక్కా ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా ఉన్నారని, గ్రామాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పటికీ మంచినీటికి దూరంగా ఉన్నాయన్నారు. గిరిజన గ్రామాలను మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు. కొన్ని గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదన్నారు. ఉమ్మడి జిల్లా కొలాం, ఆదివాసీ గిరిజన గ్రామాలకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వ నిధులపై ఆరా తీసి సక్రమంగా ఖర్చుచేయాలన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవింద్రావు, గౌరవ అధ్యక్షులు టేకం రాజు, మడావి కిషన్, నాయకులు టేకం లక్ష్మణ్, కుమ్ర రాజు, టేకం జంగు, టేకం గణేశ్, బాలు, మడావి జంగు, తదితరులు పాల్గొన్నారు.