
● ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన ● ‘సాక్షి’తో
మంచిర్యాలఅర్బన్: ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపు, నాణ్యమైన విద్యాబోధన, ఉత్తమ ఫలితాల సాధననే విద్యాశాఖ లక్ష్యం. ఉచితంగా అందిస్తున్న యూనిఫాం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, బోధన తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం..’’ అని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య అన్నారు. మరో రెండ్రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో సోమవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు, పాఠశాలల నిర్వహణపై పలు విషయాలు వెల్లడించారు.
సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు
డీఈవో: ఈ నెల ఆరు నుంచి 19వరకు బడిబాట చేపడుతున్నాం. గ్రామసభలు, స్వయం సహాయక సంఘాల సమావేశాల నిర్వహణ, ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లల గుర్తింపు, కరపత్రాల ద్వారా ప్రచారం చేపట్టాం. సామూహిక అక్షరాభ్యాసం, విలీన విద్య, బాలల సభ, బాలిక విద్య, తరగతుల డిజిటలీకరణతోపాటు చివరి రోజున క్రీడాపోటీలు నిర్వహించనున్నాం. సర్కారు బడుల్లో బోధన తీరు, సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. సర్కారు పాఠశాలల్లో నాలుగు వేల మందికి పైగా ప్రవేశాలు చేపట్టేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. అడ్మిషన్లు ఎక్కువగా చేసే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను జిల్లా, రాష్ట్ర స్థాయిలో సన్మానిస్తాం.
పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ మాటేమిటి..?
డీఈవో: బడులు ప్రారంభమైన తొలిరోజే అందరికీ పాఠ్యపుస్తకాలు, ఒక జత దుస్తులు పంపిణీ చేస్తాం. జిల్లాకు అవసరమైన 3,07,820 పాఠ్యపుస్తకాలకు గాను 2,98,670 పుస్తకాలు వచ్చాయి. ఇంకా 9, 10వ తరగతులకు పర్యావరణం పుస్తకాలు రావాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో అన్ని పుస్తకాలు రావొచ్చు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు 56వేల వర్క్బుక్స్ ఉచితంగా పంపిణీ చేయనున్నాం. 42,711 యూనిఫామ్లు అవసరం. పాఠశాల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు అందజేస్తాం.
బడుల్లో చేపట్టిన పనులు పూర్తవుతాయా..?
డీఈవో: సర్కారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 739 అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలతో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల నవీకరణ, మరమ్మతులకు రూ.22 కోట్లు కేటాయించారు. దాదాపుగా 95శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మన ఊరు–మన బడి కింద 245 పాఠశాలల్లో పనులు చేపట్టాం. ఇందులో అసంపూర్తి పనులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తాగునీరు, మరుగుదొడ్డి, ప్రహరీ వంటివి మొదలు కాకపోతే కలెక్టర్ అనుమతి ఇస్తామని తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లతోపాటు కనీస వసతుల కల్పనలో ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.
కృత్రిమమేధ ఆధారిత అభ్యసనపై వివరించండి..
డీఈవో: ప్రాథమిక స్థాయిలో అభ్యసనలో తెలుగు, ఆంగ్లం, గణితంలో వెనకబడిన విద్యార్థులు నేర్చుకోవడం, నేర్చుకున్న దాన్ని స్వయంగా పరీక్షించుకోవడం, తద్వారా అభ్యసనలో చురుగ్గా పాల్గొనడం లక్ష్యాలుగా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత అభ్యసన కార్యక్రమం రూపొందించాం. గతేడాది ప్రయోగత్మకంగా 13 మండలాల్లో 22 ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేశాం. ఈ విద్యాసంవత్సరంలో 50శాతం అంతకంటే ఎక్కువ మంది 68 పాఠశాలల్లో అమలుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి. విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు ఐదు కంప్యూటర్లు అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఉపాధ్యాయుల ఖాళీలు..
డీఈవో: 2024 డీఎస్సీ ద్వారా వివిధ కేటగిరీల్లో 265 మంది ఉపాధ్యాయులను నియమించాం. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అధిగమించాం. ఎక్కడైనా రిటైర్మెంట్లు, పలు కారణాల వల్ల ఉపాధ్యాయ ఖాళీలు ఉంటే కలెక్టర్ అనుమతితో సర్దుబాటు చేస్తాం. విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకుంటాం.
అనుమతిలేని ప్రైవేట్ పాఠశాలలపై
తీసుకుంటున్న చర్యలేమిటి..?
డీఈవో: అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడపకూడదని ఆదేశాలు ఇచ్చాం. ఒకవేళ ఎవరైనా అనుమతులు లేకుండా నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకువస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ పా ఠశాలల్లో చేర్పించే ముందు అ నుమతులు, సౌకర్యాలు ఉన్నాయా..? లేదా అని ఒకటికి రెండు సార్లు తల్లిదండ్రులు ఆలో చించాలి. ఫీజుల భారం లేకుండా ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, డిజిటల్ బోధన అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.

● ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన ● ‘సాక్షి’తో