
పత్తి విత్తేందుకు తొందరొద్దు
‘‘తొలకరి వర్షాలకు తొందరపడి పత్తి విత్తనాలు విత్తుకోవద్దు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నేలలో కనీసం తేమ కూడా రాలేదు. పంటల సాగుకు సమయం మించి పోలేదు. జూలై 15వరకు పత్తి విత్తుకోవచ్చు..’’ అని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీ) ప్రోగ్రం కోఆర్డినేటర్, వ్యవసాయ శాస్త్రవేత్త కోట శివకృష్ణ అన్నారు. బుధవారం పంటల సాగు పద్ధతులు, అధిక దిగుబడి, చీడపీడల నివారణ తదితర అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన లభించింది. సాగులో రైతుల సందేహాలను శాస్త్రవేత్త శివకృష్ణ నివృత్తి చేశారు. రైతుల ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు ఇచ్చారు. బెల్లంపల్లి
పత్తిలో అంతర పంటగా ఎన్ని సాళ్లకో కంది సాలు వేసుకోవాలి.
– జిల్లెల సుదర్శన్గౌడ్, గ్రామం: నాయకునిపేట, మం: కన్నెపల్లి
వ్యవసాయ శాస్త్రవేత్త: పత్తి పంటలో నిరభ్యంతరంగా కందిని అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. పత్తి 4–6 సాళ్ల ఎడంలో కంది సాలు వేసుకోవచ్చు. ఈ తీరుగా సాగు చేయడం వల్ల ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది.
తొలకరి వర్షాలకు పత్తి విత్తుకోవచ్చా..
– మేడి పవన్, గ్రామం: కిష్టంపేట, మం: తాండూర్, ఇందూరి భూమయ్య, గ్రామం: తంగళ్లపల్లి, మం: భీమిని
వ్యవసాయ శాస్త్రవేత్త: పత్తి విత్తుకోవడానికి ఇప్పటికిప్పుడు తొందరపడాల్సిందేమీ లేదు. తొలకరి జల్లులకు ఇంకా నేల ఏమాత్రం తడవలేదు. తేమ కూడా రాలేదు. భూమి కనీసం తొమ్మిది ఇంచుల వరకు తడిసిన తర్వాత విత్తుకోవడం ఉత్తమం. జూలై 15వరకు పత్తి విత్తుకోవడానికి సమయం ఉంది.
పత్తిలో అంతర పంటల సాగుకు
ఎలాంటి సూచనలు చేస్తారు
– కామిని శ్రీనివాస్, గ్రామం: కిష్టంపేట,
మం: తాండూర్
వ్యవసాయ శాస్త్రవేత్త: పత్తి పంటలో అంతర పంటలుగా ప్రధానంగా కంది, సోయాబీన్, పెసర సాగు చేసుకోవచ్చు. ఏటా ఏక పంట కాకుండా పంట మార్పిడి పద్ధతి పాటించాలి. ఈ విషయంలో రైతులు సరైన అవగాహన పెంచుకోవాలి.
పత్తి పంటలో గూడ రాలడాన్ని నివారించే వీలుందా..?
– కాట్న శ్రీకాంత్, గ్రామం: గంగారాం, మం: నెన్నెల
వ్యవసాయ శాస్త్రవేత్త: భారీ వర్షాలు కురవడం, ఆకస్మికంగా ప్రకృతిలో మార్పులు చోటు చేసుకోవడం మరీ ముఖ్యంగా పత్తి పంటలో సూక్ష్మపోషకాల లోపాలు ఏర్పడడం వల్ల గూడ రాలుతుంది. అందువల్ల ఫ్లానఫిక్స్ 1ఎంఎల్ 5లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
నల్ల, ఎర్రరేగడి నేలల్లో పత్తి సాగుకు వేర్వేరు విత్తనాలు ఉంటాయా..
– రాంటెంకి దశరథ్, గ్రామం: బిట్టూర్పల్లి, మం: భీమిని
వ్యవసాయ శాస్త్రవేత్త: నేలల రకాలను బట్టి విత్తుకునే పత్తి విత్తనాలు వేర్వేరుగా ఏమీలేవు. నల్ల, ఎర్ర రేగడి నేలలైనా ఒకే తీరైన పత్తి విత్తనాలు సాగు చేసుకోవచ్చు. విత్తనాలను మాత్రం ధ్రువీకరించిన కేంద్రాల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా రశీదు తీసుకుని దగ్గర ఉంచుకోవాలి.
వర్షాధారంగా వరి సాగుకు
అనువైన వంగడాలు..
– కే.రాజ్కుమార్, గ్రామం: చిన్నగుడిపేట,
మం: భీమిని
వ్యవసాయ శాస్త్రవేత్త: వరినారు మడులు జూలై 15వరకు పోసుకోవాలి. జనుము, జీలుగ విత్తనాలు చల్లుకుని సాగు చేయాలి. ఏపుగా ఎదిగాక సింగిల్ సూపర్ఫాస్పేట్ వేసి దుక్కి కలియ దున్నాలి. కునారం 1638, 118 దొడ్డురకం, జేజీఎల్ తదితర రకాల వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయి.
జూలై 15వరకు విత్తుకోవచ్చు.. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోట శివకృష్ణ ‘సాక్షి’ ఫోన్ ఇన్కు స్పందన
పత్తి పంటలో కలుపు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. గులాబీ రంగు పురుగును నివారించడం ఎలా..?
– గుమ్మడి మల్లేష్, గ్రామం: నీలాయపల్లి, మం: తాండూర్, తోట మధు, గ్రామం: నెన్నెల, అప్పని గురవయ్య, గ్రామం: లక్ష్మీపూర్
వ్యవసాయ శాస్త్రవేత్త: పత్తి పంట విత్తుకున్న 48గంటల్లోపు పెండిమిథాలిన్ కలుపు నివారణ మందును పిచికారీ చేయాలి. భూమి పదునుగా ఉన్న సమయంలో ఎకరానికి 700 ఎంఎల్ మందు పిచికారీ చేస్తే సాధ్యమైంతవరకు కలుపు రాకుండా ఉంటుంది. పత్తి పంట సేకరణ పూర్తి కాగానే పత్తి మొదళ్లను భూమిలో కలియ దున్నాలి. అలా చేయడం వల్ల గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గుతుంది. పత్తి పంట విత్తుకున్న 45 రోజుల్లో గులాబీ రంగు పురుగు కనిపించినట్లయితే పంట చుట్టూరా లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. అదే తీరుగా ప్రతీ 15–20 రోజులకోసారి వేపనూనె పిచికారీ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది.
వరిలో మొగిపురుగు సమస్యను అధిగమించడం ఎలా..
– కోట సునిల్కుమార్, గ్రామం: దుగినేపల్లి, గోమాస ప్రశాంత్, గ్రామం: మాలగురిజాల, మం: బెల్లంపల్లి
వ్యవసాయ శాస్త్రవేత్త: మొగి పురుగు ప్రభావం కనిపించకుండా నారుమడిలో 800 గ్రాముల త్రీజీ గుళికలు వేసుకోవాలి. నారు వేసిన ఎనిమిది రోజుల్లో ఎకరాకు ఎనిమిది కిలోల గుళికలు మరోమారు వేయడం వల్ల మొగి పురుగు ప్రభావం తగ్గుతుంది.
అధిక సాంద్రత పత్తి సాగుకు అనుకూలమైన పత్తి రకాలు ఏమిటి..
– బోర్ల తిరుపతి, గ్రామం: చిన్నగుడిపేట,
మం: భీమిని
వ్యవసాయ శాస్త్రవేత్త: అధిక సాంద్రత కలిగిన పత్తి విత్తుకోవడానికి రైతులు ముందుకు రావాలి. గరిష్టంగా 150–160 రోజుల్లో పంట చేతికి అందే పత్తి సాగు చేసుకోవాలి. పత్తి మొక్క ఎత్తుగా పెరగని రకాలు ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా రాశి కంపెనీకి చెందిన ఆర్సీహెచ్ 929, స్విఫ్ట్, నూజివీడు కంపెనీకి చెందిన అరమిత తదితర రకాలు సాగు చేసుకోవచ్చు.

పత్తి విత్తేందుకు తొందరొద్దు