
ప్లాట్ల లెక్క తేలేనా?
● ‘టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ’పై మరోసారి విచారణ ● స్థలాల కేటాయింపులు, నిర్వహణలో ఉల్లంఘనలు ● పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల టీఎన్జీవో ఎస్ హౌసింగ్ సొసైటీ అక్రమాల పర్వం వెలుగులోకి రానుంది. మొదటి దఫాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు దక్కించుకున్న వ్యవహారంపై మరోసారి విచారణకు రంగం సిద్ధమైంది. గత కొంత కాలంగా మంచిర్యాల టీఎన్జీవోఎస్ హౌసింగ్ సొసైటీలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల కేటాయింపులతో పలు అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సహకార చట్టం 1995, సెక్షన్ 29ప్రకారం పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ ఆదేశాలు ఇచ్చారు.
అన్యాక్రాంతమైన భూమి
సర్వే నంబరు 42లో ఇప్పటికే అనేక కబ్జాలు జరిగా యి. టీఎన్జీవోస్కు కేటాయించిన భూమిలో కొందరు నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు పొందారు. అంతేకాక కొందరు సభ్యులు సైతం ఇతరులకు అమ్ముకున్నారు. చాలామందికి ప్లాట్లు ఇచ్చినట్లు పత్రాలు ఉన్నప్పటికీ తమ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. దీనిపై సభ్యుల మధ్యే తీవ్ర వివాదాలు జరిగాయి. సభ్యులు తమకు ప్లాట్లు రాలేదని ఫిర్యాదులు చేశారు. మరోవైపు అదే భూమిలో కబ్జాలు జరగగా, సభ్యుల నుంచి పైసలు వసూళ్లు చేస్తూ సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ టీఎన్జీవోస్లకు భూమి కేటాయింపు చట్ట విరుద్ధమంటూ కోర్టు తీర్పు సైతం ఇచ్చింది.
నివేదికలకే పరిమితమా?
సహకార శాఖ పరిధిలో అనేక సంఘాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. పాలకవర్గాల్లో ఉన్న కొంద రు ఇష్టారీతిన వ్యవహరిస్తూ సంఘాల ప్రతిష్టను దె బ్బతీస్తున్నారు. ఏటేటా ఆడిట్లలో చాలా చోట్ల అక్రమాలు జరుగుతున్నాయి. వీటిపై విచారణలు జరుగుతున్నా బాధ్యులపై చర్యలు ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఉమర్మియా హౌసింగ్ సొసైటీ పేరుతో ఎక్కడ భూమి లేకున్నా కూడా, సొసైటీ పేరుతో కొందరు రియల్వ్యాపారం చేసి ప్లాట్లు అమ్మేసుకున్నారు. ఏళ్లపాటు రూ.కోట్ల లో లావాదేవీలు జరిగాయి. సొసైటీ అక్రమాలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పరిధిలో ఉందంటూ సహకారశాఖ అధికారులు చేతులు దులిపేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇవేకాకుండా జిల్లాలో ఆ యా సొసైటీల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయి.
విచారణ చేపడతాం
టీఎన్జీవోఎస్ హౌసింగ్ సొసైటీలో ప్రాథమికంగా గుర్తించిన అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతాం. ఆ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం.
– జి.హన్మంత్రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి
అధికారులే అక్రమాలు చేసి
అప్పటి నస్పూర్ గ్రామ పంచాయతీ, ప్రస్తుత కార్పొరేషన్ పరిధిలో ఉన్న సర్వే నంబరు 42లోని ప్రభుత్వ భూమిలో 29ఎకరాలను తెలంగాణ నాన్గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించారు. 2010లో ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉన్న మొత్తం 340మంది సభ్యులకు 175గజాల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించారు. ఈ ప్లాట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు చాలా ఏళ్లుగా వాదిస్తున్నారు. దీనిపై కొందరు సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. జిల్లా సహకార శాఖ అధికా రులతో ఆడిట్ చేయించారు. గతేడు నవంబర్లోనే నివేదిక ఇచ్చారు. ఆడిట్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. ప్లాట్ల నిర్ణీత విస్తీర్ణానికి అధికంగా తీసుకోవడం, ఒక చోట బదులు మరోచోట ఇళ్లు కట్టడం చేశారు. సొసైటీ లెక్కలు, ఎన్నికల, నిర్వహణలు సజావు లేవని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో మరోసారి జిల్లా సహకార శాఖ అధికారితో పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు.