
మంత్రివర్యా సమస్యలు ఆలకించరూ..!
చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా శనివారం చెన్నూర్కు వస్తుండడంతో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నా పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. సింగరేణి పారిశ్రామిక, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో తాగు, సాగునీరు, వైద్య సమస్యలతో సతమతం అవుతున్నారు. స్థానికంగా చిన్నతరహా పరిశ్రమలు లేక ఉపాధి కోసం యువత నగరాలకు వలస వెళ్తున్నారు. నియోజకవర్గం చుట్టూ గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నా ఎత్తిపోతల పథకాలు లేక సాగు, తాగునీటికి ప్రజలు తండ్లాడుతున్నారు. ఇంటింటికీ తాగునీటి సరఫరాకు మిషన్ భగీరథ పథకం ద్వారా రూ.కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోతోంది. పూర్తి స్థాయిలో పనులు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
మండలాల వారీగా..
● చెన్నూర్లో స్కిల్ డెవలప్మెంటు సెంటర్ ఏర్పాటు చేయాలి.
● చెన్నూర్ మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయానికి పక్కా భవనం
● వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలి.
● అమృత్ 2.0 పనులు పూర్తి చేయించాలి.
● చెన్నూర్లోని 50 పడకల ఆస్పత్రిలో పూర్తి స్థాయి సిబ్బంది, పరికరాలు సమాకూర్చాలి.
● భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్ట్కు పిల్ల కాలువలు నిర్మిస్తే మరో 2500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
● కోటపల్లి మండలంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు.
● పెండింగ్లో ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు పూర్తి చేయాలి.
● మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి.
● పెండింగ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కేసీ ఆర్ పార్క్, ఇతర పనులు పూర్తి చేయించాలి.
● మందమర్రిలో ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి.
● జైపూర్లోని పవర్ ప్లాంటు ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.
● శివ్వారం మొసళ్ల కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి.
వివేక్కు అమాత్య పదవితో అభివృద్ధిపై ఆశలు
పెండింగ్ పనులు పూర్తయ్యేనా..!
చెన్నూర్లో వంద పడకల ఆస్పత్రి
50పడకల ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత