
● నేడు పండుగలా పాఠశాలల పునఃప్రారంభం ● యూనిఫాం, పుస్తకాల
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 1,078 ఉండగా 1,27,568మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇందులో 40 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 5,941మంది, 684 ఎంపీపీఎస్, జెడ్పీ పాఠశాలల్లో 30,406మంది, 18కేజీబీవీల్లో 4,568మంది, ఐదు మోడల్ స్కూళ్లలో 3,100మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 42,711 యూనిఫామ్లు విద్యార్థులకు అందజేయాల్సి ఉంది. 3,07,820 పుస్తకాలు అవసరం కాగా పాఠశాలలకు చేరాయి. మొదటి రోజు ఒక్కో జత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందజేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఈ నెల 6నుంచి బడిబాటలో అడ్మిషన్లు చేపట్టారు. ఇలాంటి పిల్లలకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఎలా సర్దుబాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో 684 పాఠశాలల్లో 2,474 మంది టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. గత ఏడాది సబ్జెక్టు టీచర్ల కొరతను అధిగమించేందుకు 67మందిని సర్దుబాటు చేశారు. ఈ ఏడాది బడిబాట తర్వాత విద్యార్థుల అడ్మిషన్లు పెరిగే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై దృష్టి సారించాల్సి ఉంది.
బడి శుభ్రత, భోజనంలో నాణ్యత..
సర్కారు పాఠశాలల్లో బడి శుభ్రత, భోజనంలో నాణ్యతపై ప్రభుత్వం దృష్టి సారించింది. వంట శుభ్రత, వడ్డన అంశాలపై 1,290మంది మధ్యాహ్న భోజన కార్మికులు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. రూ.63లక్షలతో వంటపాత్రలు, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు. బోధన సామర్థ్యాలను పెంపొందించడానికి 1,130 మంది ఎస్జీటీ, 1,811మంది స్కూల్అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు.
పిల్లలను చేర్పిస్తున్నారా..? ఆలోచించండి..
పిల్లలను ఏయే బడుల్లో చేర్పించాలని తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల హంగు ఆర్భాటాలు చూసి హడావుడిగా పిల్లలను చేర్పించొద్దని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా..? పాఠశాలకు గుర్తింపు ఉందా..? ఆటస్థలాలు, అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నారా తెలుసుకుని చేర్పించాలని, లేదంటే అన్ని వసతులున్నా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే మంచిదని సూచనలు చేస్తున్నారు.
తడ‘బడి’ నిలిచింది..
మంచిర్యాలఅర్బన్: ఒకప్పుడు తొమ్మిది మంది విద్యార్థులకు పడిపోయి తడబడిన పాఠశాల 80 మందితో నిలబడింది. దూరంగా ఉన్న పాఠశాల చేరువ కావడం.. ఉపాధ్యాయులు ఉత్సాహం చూపడం విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించింది. అడ్మిషన్లు పెరగడంతో ఒక ఉపాధ్యాయుడి నుంచి ముగ్గురికి చేరింది. స్థానిక మంచిర్యాల(హరిజనవాడ) పాఠశాల భవనంలో మూడు స్కూళ్లు ఉండగా.. విద్యార్థుల ఇబ్బందులపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో డీఈవో యాదయ్య చొరవ చూపారు. గత ఏడాది జూలై 9న జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోకి స్టేషన్రోడ్ పాఠశాల తరలించారు. అంతకుముందు హరిజన పాఠశాల ప్రాంగణంలో హరిజనవాడ స్కూల్లో 30, రాళ్లపేట్ రోడ్లో 14, స్టేషన్రోడ్ స్కూల్లో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. మూడు స్కూళ్లలో 51 మంది విద్యార్థులున్నా పరిస్థితి నుంచి ఒక స్టేషన్రోడ్ స్కూల్లోనే 80కు చేరడం గమనార్హం. స్టేషన్రోడ్ స్కూల్ టీచర్లు పప్పుగుత్తివాడలో బడిబాట నిర్వహించారు. బడి మానేసిన పిల్లలను చేర్పించారు. విద్యార్థుల సంఖ్య 78మంది కాగా 18 మంది ఐదో తరగతి పూర్తయి పైచదువులకు వెళ్లనున్నారు. 60 మంది ఉండగా కొత్తగా 20 మంది అడ్మిషన్లు చేయడంతో సంఖ్య 80కి చేరింది. ప్రవేశాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
చదువులకు ఆటంకం లేకుండా చర్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు అందజేస్తాం. బడిబాట ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ సాగుతుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమున్నా చోట ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి చదువులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటాం –ఎస్.యాదయ్య, డీఈవో