
సమస్యల్లోనే స్కూళ్లు
బెల్లంపల్లి/కాసిపేట/తాండూర్/భీమిని/వేమనపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్బస్తీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. చిన్నపాటి వర్షం కురిసినా నీటితో నిండిపోతుంది. కొత్త భవన నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలు అటకెక్కడంతో ఈసారీ విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బజార్ ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, టేకులబస్తీ జెడ్పీ హైస్కూల్, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, రడగంబాల బస్తీ ప్రాథమికోన్నత పాఠశాల, శాంతిఖని జెడ్పీ హైస్కూల్లో వంటషెడ్లు, తాగునీటి సౌకర్యం, తరగతిగదులు, మరుగుదొడ్లు సరిగా లేవు.
● బెల్లంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు–మన బడి కింద చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆకెనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. అంకుశం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, బుధాకలాన్ ఎస్టీ కాలనీలోని మండల పరిషత్ పాఠశాలలో ప్రహరీ, కిచెన్షెడ్ల నిర్మాణం మందకొడిగా సాగుతోంది.
● తాండూర్ మండలం అచ్చులాపూర్ కాపువాడ, తాండూర్ అంగడిబజార్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాల్సి ఉంది. అనుమతి రాక పనులు చేపట్టలేదు. ఆవులు, గేదెలు పాఠశాలల ఆవరణను అపరిశుభ్రం చేస్తున్నాయి. కత్తెర్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు, ఫ్లోరింగ్ ధ్వంసమయ్యాయి.
● భీమిని మండలం కేస్లాపూర్ పాఠశాల నిర్మాణ దశలోనే ఆగిపోయింది. ఆ బడి విద్యార్థులు దగ్గరలోని గట్టుపల్లి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. గదుల కొరతతో ఒకే గదిలో రెండు పాఠశాలలు కొనసాగుతున్నాయి. పెద్దపేట ప్రైమరీ, భీమిని ఉన్నత పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కన్నెపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జంగంపల్లి ప్రైమరీ పాఠశాలలో ‘మన ఊరు–మన బడి’ పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
● వేమనపల్లి మండలంలోని 23పాఠశాలలకు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ప్రభుత్వం నిధులు కేటాయించింది. గత ప్రభుత్వం మన ఊరు–మన బడి కింద ఎంపిక చేసిన 11పాఠశాలల్లో మిగిలి ఉన్న పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎంపిక చేశారు. వీటిలో నీల్వాయి ఎస్టీ కాలనీ, నీల్వాయి ప్రైమరీ స్కూల్ పనులు పూర్తయ్యాయి. మిగతా పాఠశాలల్లో అడపాదడపా పనులు మిగిలి ఉన్నాయి. పెయింటింగ్ పనులు ఇంకా కొన్ని పాఠశాలల్లో పూర్తి కాలేదు. పనులు పూర్తి చేసిన స్థానిక ఎస్హెచ్జీలకు రెండు విడతల బిల్లులు మాత్రమే వచ్చాయి. మరో రెండు విడతల బిల్లులు రాక సతమతం అవుతున్నారు. కొన్ని పాఠశాలలకు ఉపాధిహామీ నిధులతో ప్రహరీ పనులు పూర్తి చేస్తున్నారు. కల్మలపేట ఎంపీపీఎస్లో భూ వివాదంతో ప్రహరీ పనులు నిలిచాయి.
● కాసిపేట మండలం పెద్ద ధర్మారంలో ప్రహరీ, తాటిగూడలో అభివృద్ధి పనులు, పెద్దనపల్లి యూపీఎస్లో నల్లా కనెక్షన్లు, వరిపేట ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ, రన్నింగ్ వాటర్, బిగించిన నల్లాలు చెడిపోయినా మరమ్మతులు చేపట్టలేదు. తరగతి గదుల్లో పనులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు.

సమస్యల్లోనే స్కూళ్లు

సమస్యల్లోనే స్కూళ్లు