
పదవొస్తుందా?
● కేబినెట్ బెర్త్ కోసం ఎమ్మెల్యేల పోటాపోటీ ● పార్టీ, నామినేటెడ్ పోస్టులపైనా ఉత్కంఠ ● హస్తం పార్టీ ఆశావహుల్లో టెన్షన్ టెన్షన్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం మొదలు కావడంతో ఎవరిని ఏ పదవి వరిస్తుందోననే ఉత్కంఠ శ్రేణుల్లో నెలకొంది. ఈ నెల 30న పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే నేపథ్యంలో పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతున్న తరుణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరిని అమాత్య పదవి వరిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖానా పూర్, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకే మంత్రి యోగానికి అవకాశం ఉంది. వీరిలో చెన్నూర్, మంచిర్యాలతోపాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ బెర్త్ కోసం ఢిల్లీ దాకా లాబీయింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఎవరికి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో సామాజిక వర్గాలు, సీనియర్లు తదితర అంశాల నేపథ్యంలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందోనని ఆశావహులు ఎదురు చూస్తున్నారు.
పదవుల్లో మొండి ‘చెయ్యి’
ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నా వారికి సముచిత అవకాశాలు రాలేదని నిరాశలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆదివాసీ నాయకుడు కోట్నాక తిరుపతి ఒక్కరికే రాష్ట్ర గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆయన పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో జోడోయాత్రలో చురుగ్గా ఉండడంతో మొదటి దఫాలో ఆయనను పదవి వరించింది. ఇక కార్మిక సంఘాల కోటాలో జనక్ప్రసాద్కు రాష్ట్ర కనీస వేతన బోర్డు చైర్మన్గా అవకాశం దక్కింది. ఆ తర్వాత ఎవరికీ దక్కలేదు. ఇటీవల నామినేట్ చేసి న ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఎవరికి అవకాశం రాలేదు. అలాగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి ఉమ్మడి జిల్లా నాయకులకు పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇవ్వలేదు. తర్వాత రాష్ట్ర కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవుల్లో తమకు అవకాశం వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీలో చేరినప్పటికీ ఎవరికి అవకాశం రాలేదు.
కేడర్లో నారాజ్
ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులు ఉన్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా పట్టుకుని కష్టకాలంలోనూ పని చేస్తున్న వా రున్నారు. సీనియర్ నాయకులతోపాటు అనేక మంది యువ నాయకులు, మహిళా, విద్యార్థి, యువజన, కార్మిక అనుబంధ సంఘాల నుంచి అనేక మంది ఉన్నారు. అందరూ తమ స్థాయిని బట్టి పదవుల్లో ప్రాధాన్యతను కోరుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల నుంచి సీనియర్ నాయకుల పేర్లు పీసీసీ పదవుల్లో చోటు కల్పించేందుకు ప్రతిపాదనలు పంపారు. వారితోపాటు నాయకులు సైతం తమకున్న పరిచయాలతో గాంధీభవన్లో ఇప్పటికే తమ బయోడేటాలతో కూడిన వివరాలు అందజేశారు. తమకు పదవుల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు.