11.5 ఎంఎల్డీ నీరు అవసరం
లీకేజీలతో ఇబ్బందులు
ఎక్కడెక్కడంటే..
అప్పుడప్పుడు ఇబ్బందులు
● వారం రోజులకోసారి నీటి సరఫరా
● ఇబ్బందులు పడుతున్న ప్రజలు
● పట్టింపు లేని అధికారులు
జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతి రోజు తాగునీటి సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరాలో అంతరాయం చోటు చేసుకోవడంతో కొన్ని కాలనీల్లో మూడునుంచి ఏడురోజులకు ఒకసారి తాగునీటి సరఫరా కొనసాగుతుంది. మధ్యలో నీరు అవసరమైతే ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. అసలే ఎండాకాలం.. ఆపై నీటిఎద్దడి తీవ్రం కావడంతో ప్రధానంగా మహిళలు నీటి కొళాయిల వద్ద పడిగాపులు పడే పరిస్థితి నెలకొంది.
జడ్చర్ల మున్సిపాలిటి పరిధిలో ప్రతిరోజు 11.5 ఎంఎల్డీ నీరు అవసరం కాగా.. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి పట్టణానికి 7–8 ఎంఎల్డీ నీరు మాత్రమే సరఫరా అవుతుంది. దీంతో తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుంది. కొన్నిరోజుల పాటు 11.2 ఎంఎల్డీ నీటిని సరఫరా చేసిన అధికారులు ఇటీవల మళ్లీ 7 ఎంఎల్డీ నీటిని మాత్రమే సరఫరా చేయడంతో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి.
పట్టణంలో పలు కాలనీల్లో తాగునీటి పైపులైన్లు లీకేజీల కారణంగా కలుషిత నీరు సరఫరా అవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా మిషన్ భగీరథ డబ్ల్యూటీపీల నుంచి శుద్ధి చేయబడిన తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే స్థానిక పైపులైన్లు లీకేజీ ఏర్పడడంతో ప్రజలు ఈ నీటిని తాగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిని డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి శుద్ధి చేయబడిన తాగునీటిని సరఫరా చేస్తున్నా.. లీకేజీల కారణంగా పథకం లక్ష్యం నిరుగారుతుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రతిరోజు శుద్ధమైన నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
జడ్చర్లలో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మున్సిపాలిటీకి 12 ఎంఎల్డీకిపైగా ప్రతిరోజు నీటిని సరఫరా చేస్తే సరిపోతుంది. ఇటీవల కొన్ని రోజులుగా 11.2 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీ ఏర్పడినప్పడు నీటి సమస్య ఏర్పడుతుంది. మున్సిపాలిటీ పరిధిలో లీకేజీలను సరిచేశాం.
– లక్ష్మారెడ్డి,
కమిషనర్, మున్సిపాలిటి, జడ్చర్ల
బాదేపల్లి పట్టణంలోని పాతబజార్, ఫకీర్నగర్, జవహర్నగర్, విద్యానగర్, క్లబ్రోడ్డు, చైతన్య నగర్, కావేరమ్మపేట, ఆదర్శనగర్ తదితర ప్రాంతాల్లో వారం రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా కొనసాగుతుందని ఆయా కాలనీల ప్రజలు పేర్కొంటున్నారు. కాలనీల పరిధిలోని సింగిల్ ఫేజ్ మోటర్ బోర్లను ఆశ్రయించి బిందెలతో నీటిని తీసుకొస్తున్నామని పలువురు మహిళలు పేర్కొన్నారు. పట్టణంలో దాదాపు 18వేల నల్లా కనెక్షన్లు ఉండగా 197 బోర్లు కొనసాగుతున్నాయి. మల్లెబోయిన్పల్లి పంపుల ద్వారా సరఫరా అవుతున్న నీటి విషయంలో సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. దీంతో దీని పరిధిలో ఉన్న కాలనీల్లో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయి.


