● జిల్లాలో తీవ్రమైన ఎండలు
● 11 గంటలకే నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు
● మధ్యాహ్నం వేళలో తల్లడిల్లుతున్న ప్రజలు
● పండ్ల రసాలు, శీతలపానియాలతో ఉపశమనం
పాలమూరు: భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మండు వేసవికి ముందే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకూ అధికం అవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం తల్లడిల్లుతున్నారు. వేడిమి నుంచి ఉపశమనం కోసం మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకు, పండ్ల రసాలను తాగుతున్నారు. నానాటికీ పెరుగుతున్న ఎండలతో జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటలకే భానుడి భగభగలు మొదలై సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతున్నాయి. పనులమీద బయటకు వస్తున్న ప్రజలు.. మధ్యాహ్నం వరకే పనులు ముగించుకొని ఇళ్లకు చేరేలా ప్రయత్నిస్తున్నారు. ఆరు బయటకు వచ్చిన జనాలు ఉపశమనం పొందేందుకు నానా ఇక్కట్లు పడ్డారు. మహబూబ్నగర్ టు రాయచూర్, హైదరాబాద్ టు మహబూబ్నగర్, భూత్పూర్ ప్రధాన రహదారులతోపాటు పట్టణాలు, గ్రామాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ద్విచక్రవాహనదారులు తలకు టోపీలు ధరిస్తూ, ముఖాలకు గుడ్డలు కట్టుకుని జాగ్రత్త పడుతున్నారు. పాదచారులు గొడుగు నీడన అడుగులు వేస్తూ భానుడి ప్రతాపం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


