గ్రామాలు పోటెత్తాయి..
● 2వ విడతలోనూ భారీగా పోలింగ్
● 87.08 ఓటింగ్ శాతంతో మళ్లీ గద్వాల జిల్లానే టాప్
● అత్యల్పంగా నాగర్కర్నూల్లో 84 శాతం..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండో విడత పల్లె పోరులోనూ ఓటర్లు పోటెత్తారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 26 మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం పోనూ మిగిలిన జీపీలకు నిర్వహించిన పోలింగ్లో మొత్తంగా 85.80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చలి నేపథ్యంలో నామమాత్రంగానే ఓటర్లు వచ్చారు. రెండు గంటల తర్వాత ఓటర్ల రాక ఊపందుకుంది. 11.30 గంటల తర్వాత ఒకేసారి భారీ ఎత్తున ఓటర్లు రావడంతో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిశాయి. కొన్ని చోట్ల ఒంటి గంట దాటినా పోలింగ్ కొనసాగింది. నిర్ణీత సమయంలోపు కేంద్రాలకు వచ్చి క్యూలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు.
84 శాతం.. ఆపైనే..
ఉమ్మడి జిల్లాలో 2వ విడతకు సంబంధించి సగటున 85.80 శాతం పోలింగ్ నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లాలో పోలింగ్ శాతం 84 కాగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోనే అంతకు పైగానే నమోదైంది. తొలి విడతలోటాప్ స్థానంలో నిలిచిన జోగులాంబ గద్వాల 87.08 శాతంతో మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వనపర్తి 87, మహబూబ్నగర్ 86.62, నారాయణపేట జిల్లాలో 84.33 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ మహిళల ఓటింగ్ శాతం తక్కువగా ఉంది.
పలు చోట్ల చెదురుమదురు ఘటనలు..
● నారాయణపేట జిల్లా ధన్వాడలో ఎన్టీఆర్ కాలనీ వద్ద బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది కాంగ్రెస్కు చెందిన వారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ప్రచారం జరగగా.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టి పంపించారు.
● వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లిలోని ఎనిమిదో వార్డులో 260 ఓట్లకు 50 ఓట్లు పోలైన తర్వాత 51వ ఓటరు వార్డు అభ్యర్థి శివమ్మ సిలిండర్ గుర్తు లేకపోవడంపై ప్రశ్నించడంతో అధికారులు అవాక్కయ్యారు. పలువురు గొడవకు దిగడంతో సుమారు గంటపాటు పోలింగ్ నిలిచింది. అధికారులు కొత్త బ్యాలెట్ పత్రాలను తెచ్చి మళ్లీ పోలింగ్ నిర్వహించారు. అంతకు ముందు వేసిన ఓటర్లను మళ్లీ పిలిపించి ఓట్లు వేయించారు.
● నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో తెల్లవారుజామున బీఆర్ఎస్లోని ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మద్దతుదారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని అదే పార్టీకి చెందిన రెబల్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సర్పంచ్ మద్దతుదారు చంద్రకళ, రెబల్గా పోటీలో ఉన్న సౌమ్య వర్గీయులు పోలింగ్ కేంద్రం సమీపంలోనే బాహాబాహీకి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడిలో గాయపడిన ఇద్దరిని జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. కాగా ఎన్నికల ఫలితాల్లో చంద్రకళ విజయం సాధించారు.
గ్రామాలు పోటెత్తాయి..


