స్వస్తిక్ ముద్ర సరిగా వేయండి
అచ్చంపేట: ఓటు వేసేటప్పుడు ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. పోలింగ్ ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే సరైన అభ్యర్థికి ఓటు వేయగలరు.
● పోలింగ్ కేంద్రం లోపలికి ఓటరు స్లిప్పు,గుర్తింపు కార్డును వెంట తీసికెళ్లాలి.
● లోపలికి వెళ్లగానే ప్రిసైడింగ్ అధికారి(పీవో) మీరిచ్చిన స్లిప్పు, జాబితా చూసి పేరు చదువుతారు.
● అక్కడున్న ఏజెంట్లు సరిచూసుకుంటారు.
● మీ ఎడమ చేతి చూపుడు వేలుకు సిబ్బంది సిరా చుక్క వేస్తారు.
● పక్కనున్న మరో సిబ్బంది మీసంతకం తీసుకుంటారు. సర్పంచ్,వార్డు మెంబరు రెండింటికీ రెండు బ్యాలెట్ పత్రాలను పద్దతి ప్రకారం మడత పెట్టి మీకిస్తారు. స్వస్తిక్ ముద్రకు సిరా అంటించి మీ చేతికిస్తారు.
● గదిలో ఓమూలన తెరచాటు ఏర్పాటు చేసి ఉంటుంది. అందులోకి మీరు వెళ్లి బ్యాలెట్ పత్రాలపై నచ్చిన వారి గుర్తుపై స్వస్తిక్ ముద్ర వేయాలి.
● సిబ్బంది ఇచ్చిన తీరులోనే మడత మార్చకుండా బ్యాలెట్ బాక్సులో వేయాలి.
● స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఒకవేళ బ్యాలెట్ పత్రాన్ని మరోవిధంగా మడత పెడితే సిరా చుక్క ఇంకో గుర్తుపై పడి మీఓటు చెల్లుబాటు కాదు.
● బ్యాలెట్ పత్రాలపై పేర్లు రాయవద్దు. వేలిముద్ర, సంతకం చేయకూడదు. స్వస్తిక్ ముద్ర అభ్యర్థి గుర్తు పైనే వేయాలి. మధ్యలో వేయకూడదు.
● పోలింగ్ కేంద్రం లోపలికి పోన్లను అనుమతించరు.చాటుగా తీసుకెళ్లి పోటోలో తీస్తే అధికారులు పట్టుకొని మీపై చర్యలు తీసుకుంటారు.


