
జూరాలకు 84,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో
● ప్రాజెక్టు 5క్రస్టు గేట్ల ఎత్తివేత
● ప్రాజెక్టు నుంచి 81,547 క్యూసెక్కుల నీరు దిగువకు..
ధరూరు/ఆత్మకూర్: ఎగువ నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 9 గంటల వరకు ప్రాజెక్టుకు 78,500క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. గురువారం రాత్రి 8.30 గంటల వరకు 84,500 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు 5 క్రస్టు గేట్లు ఎత్తి 35,770 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 44,021 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 81,547 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.275 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
12 యూనిట్లలో 674 మెగావాట్ల విద్యుదుత్పత్తి
జూరాల ప్రాజెక్టు ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు.
శ్రీశైలంలో నీటిమట్టం 884.6 అడుగులు
దోమలపెంట: శ్రీశైలం జలాశయంలో గురువారం 884.6 అడుగుల వద్ద 213.4011 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలలో ఆనకట్ట స్పిల్వే ద్వారా 35,825, విద్యుదుత్పత్తి చేస్తూ 44,021, సుంకేసుల నుంచి 2,264, హంద్రీ నుంచి 250 మొత్తం 82,360 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం వస్తున్నాయి. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,753 మొత్తం 66,068 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5 వేల, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,830, ఎంజీకేఎల్ఐకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.016 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 15.356 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.
కోయిల్సాగర్లో....
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు నుంచి వస్తున్న ఇన్ఫ్లోకు సమానంగా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 32.6 అడుగులు కాగా.. ప్రస్తుతం 32.4 అడుగులు ఉండగా, నీటి సామర్థ్యం 2.25 టీఎంసీలుగా ఉంది.
రామన్పాడుకు పెరిగిన వరద
మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయానికి గురువారం వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో కోయిల్సాగర్, సరళాసాగర్ జలాశయాల నుంచి వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమై 2 గేట్లు పైకెత్తి 4 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని వివరించారు. తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు.

జూరాలకు 84,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో

జూరాలకు 84,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో