
జూరాలకు తగ్గిన వరద
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 9 గంటలకు ప్రాజెక్టుకు 2.82 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 2.70 లక్షలకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 15 క్రస్టు గేట్లను ఎత్తి 2.436 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 70 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 410 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2.733 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.571 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.313 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 23వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 2 గేట్లను ఎత్తి దిగువన ఉన్న జూరాలకు 17,600 క్యూసెక్కుల నీటిని దగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలంలో పది గేట్లు ఎత్తివేత
దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం తగ్గినా శుక్రవారం శ్రీశైలం ఆనకట్ట వద్ద పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ఆనకట్ట స్పిల్వే ద్వారా 2.436 లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 28,262 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 13,338 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కులు మొత్తం 2.863 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. శ్రీశైలంలో ఆనకట్ట పది గేట్లు ఒకొక్కటి పది అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 2.76 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 65,784 క్యూసెక్కుల నీళ్లు అదనంగా సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.0 అడుగుల వద్ద 210.0320 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5 వేల, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,817 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.732 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 15.003 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.
745.929 ఎంయూ విద్యుదుత్పత్తి
జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 745.929 మిలియన్ యూనిట్లు చేపట్టారు.
2.70వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
15 క్రస్టు గేట్ల ఎత్తివేత
2.73 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు

జూరాలకు తగ్గిన వరద