
జూరాలకు తగ్గిన వరద
ధరూరు/ఆత్మకూర్/శాంతినగర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద సోమవారం తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 65వేల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో తెరిచి ఉంచిన క్రస్టు గేట్లను మూసివేశారు. విద్యుదుద్పత్తి నిమిత్తం 43,640 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 67, ఎడమ కాల్వకు 1,190, కుడి కాల్వకు 700.. ప్రాజెక్టు నుంచి మొత్తం 59,647 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా 8.770 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.
622 మి.యూ. విద్యుదుత్పత్తి..
జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగంగా కొనసాగుతుంది. సోమవారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 298.473 మి.యూ, దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 324.683 మి.యూ. విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు.
ఆర్డీఎస్లో పెరిగిన నీటి ప్రవాహం
శాంతినగర్: వడ్డేపల్లి మండలం జూలెకల్ సమీపంలో ఆర్డీఎస్ కెనాల్లో నీటి ప్రవాహం పెరిగింది. మూడు రోజుల క్రితం కెనాల్లో నీటి ప్రవాహం రెండు అడుగులకు పడిపోయిన విషయం తెలిసిందే. ఆది, సోమవారం ఎగువ నుంచి నీరు రావడంతో ఆరడుగులకు నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఆర్డీఎస్ ప్రధాన కాల్వ నిండుకుండను తలపిస్తుంది. ఇటీవల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కెనాల్ పరివాహక ప్రాంతాల్లోని రైతులు వారి పంట పొలాలకు నీటి తడులు ఇస్తున్నారు.
ఒక గేటు ద్వారా నీటి విడుదల
దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఆనకట్ట మూడు గేట్లలో రెండు గేట్లను అధికారులు మూసి వేశారు. ఒక గేటు పది అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 27,616 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 44,933, సుంకేసుల నుంచి 40,014 మొత్తం 84,947 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం వస్తుంది. మరోవైపు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ.జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,890 మొత్తం 66,205 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 884.0 అడుగుల వద్ద 210.0320 టీఎంసీల నీటి నిల్వ ఉంది.