ఆయకట్టుకు సాగునీరు | - | Sakshi
Sakshi News home page

ఆయకట్టుకు సాగునీరు

Jul 9 2025 7:09 AM | Updated on Jul 9 2025 7:09 AM

ఆయకట్టుకు సాగునీరు

ఆయకట్టుకు సాగునీరు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది. మంగళవారం కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు పంప్‌హౌజ్‌ వద్ద రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కేఎల్‌ఐ కాల్వలకు నీటి సరఫరాను ఆరంభించారు. ఈసారి కృష్ణానదిలో ముందస్తు వరద ప్రవాహంతో శ్రీశైలం రిజర్వాయర్‌ నిండి.. బ్యాక్‌వాటర్‌ నీటిమట్టం పెరిగింది. పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. బోరుబావుల కింద సాగుచేస్తున్న రైతు లు ఇప్పటికే వరినార్లు, విత్తనాలు వేసుకోగా.. కాల్వల కింద సాగుచేస్తున్న రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆయకట్టుకు నీటి విడుదల చేయడంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు.

● కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో మొత్తం 4.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు చేపట్టిన పనులు, రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం మేరకు 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి నీరందించలేని పరిస్థితి. పూర్తిస్థాయిలో నీటిసరఫరా చేపట్టాలంటే.. పెండింగ్‌ పనులను వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. అయితే కేఎల్‌ఐ పనులు పూర్తిచేయడంలో ఏళ్లుగా జాప్యం కొనసాగుతుండటంతో ఈసారి సైతం పరిమితంగానే ఆయకట్టు రైతులకు నీరు అందుతుంది. ప్రధానంగా కేఎల్‌ఐ విస్తరణ పనుల్లో భాగమైన 28, 29, 30 ప్యాకేజీల్లో పెండింగ్‌ పనులు పూర్తికాలేదు. వెల్దండ, ఉప్పునుంతల మండలాల్లో చివరి వరకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.

నిర్వహణ చేపడితేనే ప్రయోజనం..

కేఎల్‌ఐ కింద మూడు లిఫ్టుల్లో మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. మొదటి లిఫ్టు ద్వారా ఎల్లూరు జలాశయంతో పాటు సింగోటం రిజర్వాయర్‌, రెండో లిఫ్టు ద్వారా జొన్నలబొగుడ రిజర్వాయర్‌, మూడో లిఫ్టుతో గుడిపల్లి రిజర్వాయర్‌ను నింపాల్సి ఉంటుంది. వీటికి అనుసంధానంగా ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌లను పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో ప్రస్తుతం చెరువులను మాత్రమే నింపేందుకే అధికాారులు పరిమితమవుతున్నారు. ఒక్కో రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం ఒక టీఎంసీలోపే కావడంతో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేదు.

నిర్వహణలో నిర్లక్ష్యం..

ప్రాజెక్టు కింద చేపట్టిన మూడు లిఫ్టుల్లోనూ ఐదేసి మోటార్లతో నీటి ఎత్తిపోతలను చేపట్టాల్సి ఉండగా.. ప్రతిసారి 2 మోటార్లకు మించి పని చేయడం లేదు. మిగతా మోటార్ల మరమ్మతు కోసం ఏళ్ల సమయం పడుతోంది. కృష్ణానదిలోని నీటిని తీసుకునే ఇన్‌టెక్‌ వద్ద సర్జ్‌పూల్‌ నుంచి పంప్‌హౌస్‌లోకి నీరు చేరకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇక్కడి గేట్లకు మరమ్మతు, నిర్వహణ లేక తుప్పుపట్టి బలహీనంగా మారుతున్నాయి.

సాగునీటికి ఇబ్బంది లేకుండా..

కేఎల్‌ఐ కింద ఆయకట్టుకు నీటి సరఫరా ప్రారంభమైంది. రిజర్వాయర్లను ఎప్పటికప్పుడు ఎత్తిపోతల ద్వారా నీటితో నింపేలా చర్యలు తీసుకుంటాం. ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తాం. మోటార్ల మరమ్మతు, నిర్వహణ పనులు చేపడుతున్నాం. – విజయభాస్కర్‌రెడ్డి, సీఈ, నీటిపారుదల శాఖ

కేఎల్‌ఐ కాల్వలకు నీటి విడుదల

4.20 లక్షల ఎకరాలకునీరందించాలని లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement