
కొత్త పైప్లైన్కు మోక్షమెప్పుడో?
చిన్నచింతకుంట: మిషన్ భగీరథ పథకం నీటి సరఫరా కోసం కొత్త పైప్లైన్ నిర్మించక పోవడం మండల ప్రజలకు శాపంగా మారింది. పాత పైప్లైన్ తరచుగా లీకేజీలు అవుతుండటంతో తాగునీటి సమస్య తలెత్తుతోంది. మరోవైపు స్వచ్ఛమైన తాగునీరు కలుషితమవుతున్నాయి. కురుమూర్తి గ్రామ సమీపంలోని మిషన్ భగీరథ సంప్ నుంచి కౌకుంట్ల మండలం ముచ్చింతల వరకు 10 కి.మీ.మేర కొత్త పైప్లైన్ నిర్మించలేదు. పాత పైప్లైన్కే మిషన్ భగీరథ పథకం కనెక్షన్ ఇచ్చారు. దీంతో పాత పైప్లైన్ నిత్యం ఏదో ఒకచోట లీకేజీ ఏర్పడుతోంది. ఫలితంగా చిన్నచింతకుంట మండలంలోని 13 గ్రామాలకు తాగునీటి సమస్య తలెత్తుతోంది.
40ఏళ్ల క్రితం నాటి పైప్లైన్..
సాయిబాబా ట్రస్టు వారు 40ఏళ్ల క్రితం రామన్పాడు నుంచి చిన్నచింతకుంట మండలానికి పైప్లైన్ ఏర్పాటుచేసి తాగునీటిని అందించారు. అయితే, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో కొత్త పైప్లైన్ నిర్మించాల్సి ఉండగా.. సంబంధిత అధికారులు విస్మరించారు. కురుమూర్తి సమీపంలో నిర్మించిన తాగునీటి సంప్ నుంచి ముచ్చింతల వరకు ఉన్న పాత పైప్లైన్కే మిషన్ భగీరథ పైప్లైన్ కలిపారు. దీంతో పాత పైప్లైన్కు తరచుగా లీకేజీలు ఏర్పడుతున్నాయి. సంబంధిత అధికారులు పైప్లైన్ లీకేజీలకు మరమ్మతు చేయించడం.. మళ్లీ ఏదో చోట పైప్లైన్ పగిలిపోవడం పరిపాటిగా మారింది. ఫలితంగా చిన్నచింతకుంట, కురుమూర్తి, అమ్మాపురం, గూడూర్, మద్దూర్, ఏదులాపురం, కౌకుంట్ల మండలంలోని తిర్మలాపూర్, దాసర్పల్లి, అప్పంప ల్లి, ముచ్చింతల, రాజోళి తదితర గ్రామాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది.
తరచుగా సమస్య..
మండలంలోని గ్రామాలకు పాత పైప్లైన్ ద్వారానే మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. దీతో తరచుగా లీకేజీలు ఏర్పడుతూ తాగునీటి సమస్య ఏర్పడుతుంది. మరోవైపు తాగునీరు కలుషితం అవుతున్నాయి. ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కొత్త పైప్లైన్ నిర్మించాలి.
– కాంతారావు, మాజీ సర్పంచ్, గూడూరు
ప్రతిపాదనలు పంపించాం..
రామన్పాడు నుంచి 13 గ్రామాలకు నీటిని సరఫరాచేసే పాత పైప్లైన్ తొలగించి కొత్త పైప్లైన్ ఏర్పాటు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అధికారుల నుంచి ఆదేశాలు రాగానే కొత్త పైప్లైన్ ఏర్పాటుకు చర్యలు చేపడుతాం. ప్రస్తుతం ఎక్కడ లీకేజీలు ఏర్పడినా వెంటనే సరిచేసి గ్రామాలకు తాగునీరు అందిస్తున్నాం.
– వినోద్, ఏఈ, మిషన్ భగీరథ పథకం
పాత పైప్లైన్తోనే 13 గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా
తరచుగా లీకేజీలు ఏర్పడుతున్న వైనం
తాగునీటి సరఫరాలో అంతరాయంతో ప్రజల అవస్థలు
పట్టించుకోని అధికారులు

కొత్త పైప్లైన్కు మోక్షమెప్పుడో?

కొత్త పైప్లైన్కు మోక్షమెప్పుడో?