మరిపెడ రూరల్ : బైక్ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ కార్పెంటర్ మృతి చెందాడు. ఈ ఘటన మహబూ బాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్లలో సూర్యాపేట–మహబూబాబాద్ 365 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం కొప్పొల్ గ్రామానికి చెందిన పర్వతం నరేశ్ (36) మరిపెడలో కార్పెంటర్ షాపు నిర్వహిస్తున్నాడు.శనివారం సాయంత్రం పని ముగించుకుని బైక్పై స్వగ్రామం వెళ్తున్నాడు. ఈ క్రమంలో తానంచర్ల గ్రామంలోని గంగభవాని ఆలయ రహదారి నుంచి మొక్కజొన్న లోడ్తో హైవే మీదికి వచ్చిన ట్రాక్టర్.. బైక్ను ఎదురుగా ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంతోపాటు నరేశ్ ట్రాక్టర్ ట్రాలీ కింద ఇరుక్కుకోవడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు.
నర్మెట(తరిగొప్పుల) : రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలీపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్ద రాంచరణ్ (16) తల్లి తారమ్మ, అక్క సాత్విక, మేనకోడలు ప్రియాన్షి, అల్లుడు రిషిని తీసుకుని బైక్పై అమ్మమ్మగారిల్లు కూటిగల్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కూటిగల్కు చెందిన సిరిగిరి రాహుల్ మిత్రుడితో కలిసి బైక్పై ఎదురుగా వచ్చి సోలీపురం కట్టమైసమ్మ గుడి సమీపంలో రాంచరణ్ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో రాంచరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తారమ్మ, సాత్విక, ప్రియాన్షి, రిషి, రాహుల్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి పెద్దనాన్న కుమారుడు హరీశ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గుగులోత్ శ్రీదేవి తెలిపారు.
● కార్పెంటర్ మృతి..తానంచర్లలో ఘటన
● మృతుడు సూర్యాపేట జిల్లా వాసి


