హత్య కేసులో ఒకరికి యావజ్జీవ శిక్ష
బాలికపై
లైంగికదాడి,
● తీర్పు వెలువరించిన ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ఎం.డి అబ్దుల్ రఫీ
మహబూబాబాద్ రూరల్ : లైంగికదాడి ఘటనలో ఓ బాలిక మృతి(హత్య) చెందింది. ఈ కేసులో లైంగికదాడికి పాల్పడినందుకు ఓ యువకుడికి పదేళ్లు, అలాగే, హత్య చేసినందుకు యావజ్జీవ కారాగారశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ బుధవారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి చేనుమోలు శ్రీనివాస్ కథనం ప్రకారం.. జిల్లాలోని మరిపెడ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక 2021, మే 5వ తేదీన తమ దుకాణం వద్ద ఒంటరిగా ఉంది. ఈ సమయంలో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అదే మండలంలోని తండా ధర్మారానికి చెందిన ధరంసొత్ రాజేశ్.. ఆమె వద్దకు వెళ్లి చెప్పాడు. అనంతరం ఆ బాలికపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడగా మృతిచెందింది. అదే రోజున ఆ బాలిక తండ్రి మరిపెడ పీఎస్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై శ్రీనివాసరెడ్డి పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ సాగర్ విచారణ పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ పర్యవేక్షణలో ప్రస్తుత మరిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్, ఎస్సై వీరభద్రరావు, కోర్టు లైజన్ అధికారి జీనత్ ఆధ్వర్యంలో సీడీఓ శ్రీనివాస్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ పక్షాన పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య వాదనలు వినిపించగా నేరం రుజువైంది. దీంతో రాజేశ్కు లైంగికదాడి కేసులో పదేళ్లు జైలు శిక్ష, హత్యచేసిన కేసులో యావజ్జీవ కారాగారశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ తీర్పు వెలువరించారు. పోలీసు బృందం నిరంతర కృషి ఫలితంగా కోర్టు నేరస్తుడికి కఠిన శిక్ష విధించిందని ఎస్పీ శబరీశ్ తెలిపారు. కాగా, జిల్లా కేంద్రంలో ప్రత్యేక పోక్సో కోర్టు ఏర్పాటయ్యాక నేరస్తుడికి యావ జ్జీవ కారాగారశిక్ష పడడం ఇదే ప్రథమం.


