సంక్షేమం అవసరమే.. కానీ సమగ్రాభివృద్ధే కీలకం
కేయూ క్యాంపస్ : దేశంలో ధనిక–పేదల మధ్య అంతరం బాగా పెరిగిపోతోందని వివిధ నివేదికలు సూచిస్తున్నాయని, ప్రజలకు సంక్షేమం అవసరమే.. కానీ సమగ్రాభివృద్ధి కీలకమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. కేయూలో పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘పాపులిస్టు పాలసీస్ ఇన్ పోస్టులిబరలైజేషన్ ఇండియా’ అనే అంశంపై సోమవారం క్యాంపస్లోని సెనేట్హాల్లో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సుకు రిజిస్ట్రార్ రామచంద్రం అధ్యక్షత వహించారు. బడుగు, బలహీన వర్గాలకు వివిధ అవసరాలు తీర్చేందుకు సంక్షేమ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఓటర్లు ఆకర్షించేందుకు రాజకీయ ఆయుధాలుగా మారుతున్నాయన్నారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజకీయ వ్యవస్థ మధ్య సమతుల్యం అవసరమన్నారు. దేశంలో తగిన ఆహారం, నివాసం, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలు కీలకమన్నారు.
ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లిష్ మీడియంలోనే విద్యనందించాలి
గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంటర్మీడియట్ వరకు వి ద్యార్థినులకు ఇంగ్లిష్ మీడియంలోనే విద్యనందిస్తే వారు భవిష్యత్లో అనేక అవకాశాలు అందిపుచ్చుకుంటారని ప్రముఖ సామాజికవేత్త, ఓయూ రిటైర్డ్ ఆచార్యుడు కంచ ఐలయ్య అన్నారు. జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. విద్యే వ్యక్తిని మందుకు నడిపిస్తుందన్నారు. ఆంగ్లభాషపై పట్టు సాధిస్తే అనేక అవకాశాలు అందిపుచ్చుకోవచ్చునన్నారు. ఏపీలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పాఠశాలు , కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారన్నారు. అలాగే అమ్మ ఒడి పథకం ద్వారా నేరుగా విద్యార్థుల తల్లుల అకౌంట్లలో డబ్బులు జమచేశారన్నారు. తద్వారా వారికి ఎంతో లబ్ధి జరిగిందని అభిప్రాయపడ్డారు.
అమెరికా,యూరప్ ఒప్పందాలతో తీవ్ర ప్రభావం
అమెరికా–యూరప్లతో భారతదేశం ఇటీవల చేసుకున్న ఒప్పందాలతో రాబోయే కాలంలో దేశంపై తీవ్రప్రభావం చూపతుందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోందన్నారు. ఆయా ఒప్పందాలతో మరింతగా సరళీకరణ , ప్రైవేటీకరణతో వివిధ రంగాలపై ప్రతికూల ప్రభావం పడబోతోందన్నారు.
సంక్షేమం కోసం నేరుగా నగదు బదిలీ..
కేంద్ర ,రాష్ట్రాల్లో ప్రజల సంక్షేమం పేర వివిధ పథకాలకు నేరుగా నగదు బదిలీ పథకాలు ప్రవేశపెట్టారని ప్రముఖ పాత్రికేయుడు కె. శ్రీనివాస్ అన్నారు. ఇలాంటి వాటితో ఆశించిన స్థాయిలో పేదల జీవితాలు మారవన్నారు. సమాజ సమస్యలను పాలకవర్గాలు అంతగా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో రాజనీతిశాస్త్ర విభాగం అధి పతి సంకినేని వెంకటయ్య, సోషల్సైన్స్ డీన్ బి. సు రేశ్లాల్ , బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ గడ్డం కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు. వివిధ సెషన్లలో ప్యానల్గా చర్యలు జరిగాయి. నేడు (మంగళవారం) ఈ సదస్సు ముగియనుంది.
వీసీ కె.ప్రతాప్రెడ్డి
కేయూలో జాతీయ సదస్సు
సంక్షేమం అవసరమే.. కానీ సమగ్రాభివృద్ధే కీలకం
సంక్షేమం అవసరమే.. కానీ సమగ్రాభివృద్ధే కీలకం


