న్యాయవాదులపై దాడులు, హత్యలు ఆందోళనకరం
వరంగల్ లీగల్ : న్యాయవాదులపై దాడులు, హత్యలు ఆందోళనకరమని వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ తెలిపారు. ఇటీవల న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, హత్యలను ఖండిస్తూ వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్లు సంయుక్తంగా సోమవారం జిల్లా కోర్టు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులు న్యాయ వ్యవస్థలో ముఖ్య స్తంభమన్నారు. అలాంటిది భయభ్రాంతులకు లోనై పనిచేయాల్సిన పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదన్నారు. ఇటీవల చేవెళ్లలో మహిళా న్యాయవాది స్వప్న హత్య, అత్తాపూర్లో న్యాయవాది మహమ్మద్ ఖాదీర్ హత్య వంటి ఘటనలు న్యాయవాదుల భద్రతపై సందేహాలు కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా న్యాయవాదుల పై దాడులను అరికట్టాలంటే ప్రత్యేకంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఐక్యతే ఈ పోరాటానికి బలమని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వరంగల్ డీఆర్ఓ విజయలక్ష్మి, హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవిని వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు అందించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ బార్ ఉపాధ్యక్షులు మైదం జయపాల్, చిర్ర రమేశ్ బాబు, ప్రధాన కార్యదర్శులు డి.రమాకాంత్, కొత్త రవి, సంయుక్త కార్యదర్శులు ముసిపట్ల శ్రీధర్, ఎం.కె అంబేడ్కర్, గ్రంథాలయ కార్యదర్శులు గుండా కిశోర్, కాటబోయిన వెంకటేష్, క్రీడా సాంస్కృతిక కార్యదర్శులు నలిగంటి శివ ప్రసాద్, సి. మల్లేశ్, హనుమకొండ కోశాధికారి చింత సాంబశివరావు, కార్యవర్గ సభ్యులు కొనాల ఆశీర్వాదం, మడిపెల్లి మహేందర్, మర్రి రాజు, జాటోతు రవి,తదితరులు పాల్గొన్నారు.
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలి
న్యాయవాద సంఘాల ఆందోళన


