అబార్షన్ల కలకలం
జిల్లాలో వరుస సంఘటనలతో బెంబేలు
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు పట్టణాల్లో విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల డాక్టర్లు.. ఆర్ఎంపీలు, ఇతరులతో దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ దందాకు పాల్పడుతున్నట్లు తెలిసింది. కాగా, వైద్యారోగ్యశాఖ అధికారులకు తెలిసినప్పటికీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు..
● కొద్దిరోజుల క్రితం బయ్యారం మండలానికి చెందిన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఓ యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భవతి కావడంతో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేసి.. సదరు వ్యక్తిని పోలీసులు అదుపలోకి తీసుకొని విచారణ చేపట్టిన పోక్సో కేసు నమోదు చేశారు. కాగా, ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించిన అధికారులు బాలిక అబార్షన్ ఏ ఆస్పత్రిలో జరిగిందని ఆరా తీస్తున్నారు.
● మూడు నెలల క్రితం మహబూబాబాద్ మండలానికి చెందిన గర్భిణికి నెక్కొండ ప్రాంతంలో లింగనిర్ధారణ పరీక్షలు చేయడంతో ఆడ శిశువు అని తేలింది. కాగా స్థానిక ఆర్ఎంపీ ఇచ్చిన మాత్రలతో గర్భవిచ్ఛిత్తి కాకపోవడం.. మహిళకు సీరియస్గా ఉండడంతో మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చి ఆబార్షన్ చేసినట్లు ప్రచారం జరిగింది. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మహిళకు చికిత్స అందించారు. అయితే, ఈ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకునే విషయం కోర్టు పరిధిలో ఉందని తెలిసింది.
● నెల రోజుల క్రితం మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్లు జరుగుతున్నాయని జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంపై జిల్లా అధికారులు ఆస్పత్రిని తనిఖీ చేసి రికార్డులు స్వాధీనం చేసుకొని వెళ్లిన విషయంపై జిల్లాలో చర్చ జరిగింది.
● తొర్రూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సింహులపేట మండలానికి చెందిన ఓ మైనర్ బాలికకు అబార్షన్ చేసిన విషయంపై ఆనోట ఈ నోట వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు.
● తొర్రూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆబార్షన్ చేసి శిశువును కాల్వలో పడవేసిన సంఘటనపై జిల్లాలో చర్చ జరిగింది. అయితే అబార్షన్ చేసిన ఆస్పత్రి ఎక్కడ అనేది ఇప్పటి వరకు తేల్చలేదు.
వారే టార్గెట్..
గర్భం దాల్చిన మైనర్ బాలికలు, లింగనిర్ధారణ పరీక్షల ద్వారా ఆడపిల్ల అని తెలుసుకున్న దంపతులు అబార్షన్లకు మొగ్గు చూపుతున్నారు. ఈవిషయం తెలుసుకున్న దళారులు వారిని ఆస్పత్రులకు తీసుకొచ్చి అబార్షన్లు చేయిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఆస్పత్రుల యాజమాన్యాలు ఒక్కొక్కరి నుంచి రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు వసూళ్లు చేయడం.. ఇందులో మధ్యవర్తులకు కమీషన్లు ఇస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ పాపపు పనికి ఒడిగడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న వారిని నేషనల్ టీమ్ వచ్చి గుర్తించే వరకు జిల్లా అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం కొన్ని ఆస్పత్రుల నుంచి అధికమొత్తంలోనే డబ్బులు చేతులు మారుతున్నాయని ప్రచారం. ఉన్నతాధికారులు దృష్టి పెడితే అబార్షన్ల వ్యవహారం బట్టబయలు అవుతుందని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
విచారణతో సరిపెడుతున్న అధికారులు
జిల్లా పరిస్థితిపై ఉన్నతాధికారుల ఆరా..
బయ్యారం ఘటనపై పోలీసుల ఎంకై ్వరీ
తనిఖీలు నిర్వహిస్తున్నాం
జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆబార్షన్లు జరుగుతున్న విషయంపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ ఆస్పత్రిపై పోలీస్ కేసు కూడా పెట్టాం. ఆది కోర్టు విచారణలో ఉంది. బయ్యారం కేసు విషయంపై పోలీసుల విచారణ జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేయడం, లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరం. ఫిర్యాదులు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
– రవి రాథోడ్, డీఎంహెచ్ఓ
అబార్షన్ల కలకలం


