కొత్తవారికే లక్కు.. | - | Sakshi
Sakshi News home page

కొత్తవారికే లక్కు..

Oct 29 2025 8:37 AM | Updated on Oct 29 2025 8:37 AM

కొత్త

కొత్తవారికే లక్కు..

మహబూబాబాద్‌ రూరల్‌ : జిల్లాలో మద్యం షాపులను దక్కించుకునేందుకు అధిక సంఖ్యలో దరఖాస్తులు సమర్పించగా.. కొత్తవారినే లక్కు వరించింది. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్‌ హాల్‌లో మద్యం షాపుల లక్కీడ్రా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ హాజరై లక్కీడ్రా తీసి ఎంపికై న వారి పేర్లు ప్రకటించారు. కాగా, 2025–2027వరకు నూతనంగా వైన్‌ షాపుల నిర్వహణ కొనసాగనుంది. ఈమేరకు ఈ ఏడాది డిసెంబర్‌ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది.

వీడియో చిత్రీకరణ మధ్య..

వీడియో చిత్రీకరిస్తూ డ్రా తీసి పేర్లు పిలవడంతో పాటు వచ్చిన నంబర్‌ను దరఖాస్తుదారులకు చూపి ంచారు. దుకాణాలు దక్కించుకున్న వారు వార్షిక లైసెన్స్‌ ఫీజులో ఆరోవంతు చెల్లించి లైసెన్స్‌లు పొందారు. జిల్లాలో 61 షాపులకు 1,800 దరఖాస్తులు రాగా.. దరఖాస్తుదారులతో ఏబీ గార్డెన్స్‌ ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపించింది. లాటరీ తీసే సమయంలో ప్రతీ ఒక్కరు టెన్షన్‌ పడుతూ కనిపించారు. ఏమవుతుందో ఏమో అన్న ఉత్కంఠ అందరిలో కనిపించింది. కాగా డ్రా ప్రక్రియ రెండు గంటల్లోనే ముగియడం విశేషం.

ఒక పక్క సంతోషం.. మరోపక్క నిరాశ

రెండేళ్ల పాటు వైన్‌షాపుల నిర్వహణకు లైసెన్స్‌ పొందినవారు సంతోషంలో మునిగిపోగా... అదృష్టం వరించనివారు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. కాగా డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగింసింది. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌శాఖ అధికారి బి.కిరణ్‌ ఆధ్వరర్యంలో డ్రా నిర్వహించగా అదనపు కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌, వరంగల్‌ ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ శ్రీనివాసరెడ్డి, సీఐలు చిరంజీవి, భిక్షపతి, అశోక్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ నాగేశ్వర్‌ రావు, ఎస్సైలు రవికుమార్‌, అశోక్‌ కుమార్‌, మౌనిక, రాజేశ్వరి, రవళిరెడ్డి, శంకర్‌, డీటీఎఫ్‌ ఎస్సై కిరీటి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సై చంద్రశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఒకే దరఖాస్తుతో..

జిల్లా పరిధిలో మద్యం షాపుల ఏర్పాటు కోసం కొందరు మొదటిసారిగా దరఖాస్తు చేశారు. కాగా, మానుకోట మండలం వేమునూరు గ్రామానికి చెందిన నలమాస రాంబాబు గెజిట్‌ సీరియల్‌ నంబర్‌–2కు, జిల్లా కేంద్రానికి చెందిన గొల్లపల్లి వెంకటేశ్వర్లు గెజిట్‌ సీరియల్‌ నంబర్‌–4కు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు సమర్పించగా వారిద్దరిని అదృష్టం వరించింది. అదే విధంగా జిల్లా కేంద్రానికి చెందిన గోట్ల వెంకటేశ్వర్లుయాదవ్‌ గెజిట్‌ సీరియల్‌ నంబర్‌–31కి, ఆయన కుమారుడు రాకేశ్‌ యాదవ్‌ గెజిట్‌ సీరియల్‌ నంబర్‌–12కు దరఖాస్తు చేయగా తండ్రీకొడుకులను అదృష్టం వరించింది. ఇకపోతే హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ప్రాంతానికి చెందిన ఎన్‌.శ్రీవాణి గెజిట్‌ సీరియల్‌ నంబర్లు 15, 17, 21కు దరఖాస్తు చేయగా ఆమెకు మూడు షాపులు దక్కాయి.

కొత్తవారే అధికం...

పాత వ్యాపారుల్లో కొంతమందికే షాపులు దక్కగా ఈ ఏడాది మద్యం వ్యాపారంతో సంబంధంలేని కొత్త వ్యక్తులు తెరమీదకు వచ్చారు. చాలా చోట్ల గ్రూపులుగా ఏర్పడి పదుల సంఖ్యలో దరఖాస్తులు చేశారు. వీరికి దీటుగా పాత వ్యాపారులు సైతం వందల సంఖ్యలో దరఖాస్తులు చేసినప్పటికీ లాటరీలో వారికి సింగిల్‌ డిజిట్‌ దుకాణాలకు మించి రాలేదు.

ప్రయత్నాలు ముమ్మరం..

మద్యం వ్యాపారంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కొంతమంది వ్యాపారులకు షాపులు రాలేదు. కాగా, కొత్తగా షాపులు దక్కించుకున్న వారికి భారీగా ఆఫర్లు ఇచ్చి షాపులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కొత్తగా షాపులు దక్కించుకున్న వారితో బేరసారాలు నడుపుతున్నట్లు సమాచారం.

లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

పాత వ్యాపారుల్లో కొంతమందికే

దక్కిన వైన్‌షాపులు

ఒక్క దరఖాస్తుతోనే వరించిన అదృష్టం

తండ్రీకొడుకులకు రెండు షాపులు

రెండు గంటల్లోనే ముగిసిన డ్రా ప్రక్రియ

భారీ బందోబస్తు..

మద్యం షాపుల డ్రా సందర్భంగా దరఖాస్తుదారులు, వారి బంధువులు, స్నేహితులతో ఏబీ ఫంక్షన్‌ హాల్‌ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా వారి వాహనాలతో చుట్టూ పక్కల ప్రాంతాలు నిండిపోయాయి. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ ఆదేశాల మేరకు టౌన్‌ సీఐ గట్ల మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు ప్రశాంత్‌ బాబు, శివ, సూరయ్య, పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. కాగా, లక్కీ డ్రా కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లను అనుమతించకపోవడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కొత్తవారికే లక్కు..1
1/1

కొత్తవారికే లక్కు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement