‘ఇందిరమ్మ’ బిల్లు రాకపాయె!
సాక్షి, మహబూబాబాద్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే పలువురికి బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త ఇల్లు మంజూరు కావడంతో.. ఉన్న ఇళ్లు కూల్చివేశామని, ప్రస్తుతం బిల్లులు రాకపోవడంతో తిప్పలు పడుతున్నామని, అధికారులు స్పందించి చెల్లించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.
సర్వేలో తప్పులు.. లబ్ధిదారుల తిప్పలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమం ద్వారా పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే నిర్వహించారు. ఇందులో సొంత ఇంటి స్థలం ఉండి శిథిలావస్థలో ఇల్లు ఉన్నవారు, ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనివారు, ఇల్లు, స్థలం రెండూ లేని వారుగా మూడు విభాగాలుగా గుర్తించారు. అయితే అందులో సర్వేకోసం వచ్చిన వారు తప్పులుగా నమోదు చేశారు. ఇంటి పేరు, ఆధార్ నంబర్, పేర్లు, భర్త, తండ్రి పేర్లు తప్పుగా నమోదు చేశారు. ఇలాంటి తప్పులను చూడకుండా, వాటిని సరిచేయకుండానే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఆర్భాటంగా నిర్మాణాలు చేపట్టారు. తీరా ఇల్లు నిర్మాణం మొదలైన తర్వాత ఫొటో క్యాప్చర్ కాకపోవడం, ఇతర తప్పులతో బిల్లులు రావడం లేదు.
లబ్ధిదారుల ప్రదక్షిణలు..
అధికారులు చెప్పినట్లు తూచ తప్పకుండా ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు బిల్లులు రాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆధార్ నంబర్, ఇంటిపేరు, తండ్రి, భర్త పేర్లు ఇలా తప్పులు ఉంటే.. ముందుగా ఎంపీడీఓ లాగిన్లో సరిచేస్తారని అక్కడికి పంపించారు. అక్కడ కాకపోతే కలెక్టర్ కార్యాలయంలోని హౌసింగ్ అధికారుల వద్దకు రావడం.. అక్కడ కూడా సరి చేయకపోవడంతో ఎక్కడికి వెళ్తే తమ సమస్యకు పరిష్కారం అవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. తమతో పాటు ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి బిల్లులు వచ్చాయని, తమకెందుకు బిల్లులు రావడం లేదని అధికారులను నిలదీస్తున్నారు. ఈమేరకు ఒక అధికారి కలెక్టర్ లాగిన్లో ఆగిందని, మరొకరు ఎండీ వద్ద ఆగిందని చెబుతూ తమ చేతిలో ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వేలో తప్పులతో ఇందిరమ్మ ఇళ్ల
లబ్ధిదారుల సతమతం
ఇళ్లు నిర్మిస్తున్నా.. అందని బిల్లులు
తప్పులు సవరించాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
పెండింగ్లో 1,300 ఇళ్ల బిల్లులు
ఇందిరమ్మ ఇళ్లకోసం ముందుగా చేపట్టిన పైలెట్ పంచాయతీల్లో 602, ఐటీడీఏ ద్వారా 11,00, రెండో విడత 8,949 ఇళ్లు.. మొత్తం 10,651 ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇందులో 9,931 ఇళ్లకు కలెక్టర్ పునఃపరిశీలించి మంజూరీ ఇచ్చారు. ఇందులో ఇప్పటి వరకు 8,047 మంది ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 6,670 ఇళ్లు బేస్మెంట్ లెవల్, 2,581 ఇళ్లు గోడల వరకు, 561 ఇళ్ల స్లాబ్లు వేశారు. వీరిలో వారి వారి నిర్మాణం స్థాయిని బట్టి మొత్తం 9,812 బిల్లులు చెల్లించాలి. కానీ ఇప్పటి వరకు 8,512 బిల్లులు చెల్లించగా.. 1,300 మంది ఇళ్ల బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
‘ఇందిరమ్మ’ బిల్లు రాకపాయె!


