
దీప్తి.. ఘనకీర్తి
● మరో గోల్డ్ మెడల్ సాధించిన
భారత పారా అథ్లెట్
పర్వతగిరి: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరుగుతున్న విర్ట్చూస్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి మరో గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల టీ–20 విభాగంలో 400మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించగా, మంగళవారం జరిగిన 200మీటర్లపరుగు పందెంలో మరో గోల్డ్ మెడల్ సాధించింది. దీప్తి పలు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. దీనిపై తల్లిదండ్రులు, గ్రామస్తులు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
బీసీ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్గా వేణుగోపాల్ గౌడ్
హన్మకొండ: తెలంగాణ స్టేట్ బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్గా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ను నియమించినట్లు ఆ జేఏసీ రాష్ట్ర కార్యనిర్వాహక చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న హనుమకొండ నయీంనగర్కు చెందిన వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ను ఈ పదవిలో నియమిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. కాగా, బీసీలను రాజకీయంగా ఎదగకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అడ్డుకుంటున్న వారికి తగిన బుద్ధి చెబుతామని వేణుగోపాల్ గౌడ్ అన్నారు. తనను ఈ పదవిలో నియమించిన జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య, కార్యనిర్వాహక చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ నారగోని, కోచైర్మన్లు రాజారాం యాదవ్, దాసు సురేశ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు.
పాత ఫీజులనే కొనసాగిస్తాం
● రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం
కేయూ క్యాంపస్ : గత విద్యాసంవత్సరంలోని కామన్ సర్వీస్, పరీక్ష ఫీజులనే కొనసాగిస్తామని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కేయూ పరిధిలో 2025–26 విద్యాసంవత్సరానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్) కామన్ సర్వీస్, పరీక్ష ఫీజులను పెంపుదలపై వివిధ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో 2024–25లో ఉన్న ఫీజులనే కొనసాగిస్తామన్నారు. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపా ళ్లు తమ కళాశాలల విద్యార్థులకు కూడా తెలియజేయాలని రిజిస్ట్రార్ కోరారు.
చేపల వల కాలికి
తట్టుకొని యువకుడి మృతి
గార్ల : కాలికి చేపల వల తట్టుకొని చెరువులో పడి ప్రమాదవశాత్తు ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్ల గార్ల మండలం గోపాలపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాంపాటి ఉపేందర్ (32), అదే గ్రామానికి చెందిన నర్సయ్యతో కలిసి సమీపంలోని అప్పసముద్రం చెరువులో రాత్రివేళ చేపల వేటకు వెళ్లారు. అయితే ఇద్దరిలో నర్సయ్య ఒక్కడే ఇంటికి వచ్చి నిద్రించాడు. ఉదయమైనా ఉపేందర్ ఇంటికి రాకపోవడంతో మృతుడి తల్లి కోటమ్మ కుటుంబ సభ్యులతో కలిసి చెరువులో గాలించగా, ఉపేందర్ శవమై కనిపించాడు. మృతుడి కాళ్లకు చేపల వల చుట్టుకొని చనిపోయి ఉన్నాడు. మృతుడితో కలిసి వెళ్లిన నర్సయ్యను పోలీసులు స్టేషన్కు పిలిచి విచారించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కే రియాజ్పాషా తెలిపారు.

దీప్తి.. ఘనకీర్తి

దీప్తి.. ఘనకీర్తి

దీప్తి.. ఘనకీర్తి