
గంజాయి పట్టివేత
రూ.
కోట్ల విలువైన
3.81
నలుగురు అరెస్ట్, మరో నలుగురు పరార్
వరంగల్ క్రైం: వరంగల్ జిల్లా ఖానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకలగుట్ట దగ్గర భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల నుంచి కర్ణాటకకు సరఫరా చేయడానికి గంజాయి సిద్ధంగా ఉందనే సమాచారం మేరకు ఖానాపురం, వరంగల్ డ్రగ్ కంట్రోల్ టీం సంయుక్తంగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.3,81,92,250 విలువైన 763 కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సీపీ చెప్పారు.
నిందితులు వీరే..
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి మండలం గుంపినగండి గ్రామానికి చెందిన అందాల పాండురెడ్డి, ఒడిశాలోని నిమ్మలపాలెం గ్రామానికి చెందిన గుళ్లారి మునిరాజ్, దులగండి గ్రామానికి చెందిన కొప్పు కోటయ్య, తెలంగాణలోని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పోలారంతండాకు చెందిన భూక్య సాయికుమార్, కలిమేల మండలం గుర్రలూరు గ్రామానికి చెందిన రమేశ్, గిల్లమడుగు గ్రామానికి చెందిన మజ్జి కృష్ణ, నిమ్మలపాలెం గ్రామానికి చెందిన నాయిని రమేశ్, బీదర్కు చెందిన ప్రకాశ్.
గంజాయిని దాచి..ఆపై పట్టుబడి
నిందితులు పాండు రెడ్డి, గుళ్లారి మునిరాజ్, కొప్పు కోటయ్య, భూక్య సాయికుమార్ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మరో ఇద్దరు నిందితులు రమేశ్, మజ్జి కృష్ణ గంజాయి అమ్ముతున్నారని తెలు సుకుని వారితో పరిచయం పెంచుకున్నారు. అనంతరం రమేశ్, మజ్జి కృష్ణ ఆదేశాల మేరకు గంజాయి ని వాహనాల్లో వారు చెప్పిన చోటుకు చేర్చేవారు. దీనికి రూ.వెయ్యి చొప్పున కూలి కట్టించేవారు. ఇందులో భాగంగా గత నెల 28న నిందితులు పాండు, మునిరాజ్, కోటయ్య, రమేశ్ కలిసి తులసిపాక నుంచి నంబర్లేని ఆటో ట్రాలీలో గంజాయి తీసుకుని భద్రాచలం, ఇల్లందు మీదుగా వరంగల్ బయలుదేరారు. ఈ క్రమంలో పాకాల దాటిన తర్వాత పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు గమనించిన నిందితులు ఈ విషయాన్ని కృష్ణకు చేరవేశారు. దీంతో అతడి ఆదేశాల మేరకు చిలుకలగుట్టపై గంజాయి బస్తాలు దాచి వెళ్లిపోయారు. అనంతరం ఈనెల 1న సాయికుమార్.. గంజాయి కొనుగోలు చేసే వ్యకిని తీసుకొస్తున్నాడని రమేశ్ ఫోన్ ద్వారా మనిరాజ్, కోటయ్య, మజ్జి కృష్ణకు చెప్పాడు. గంజాయి బస్తాలను కిందికి గుట్ట నుంచి దించుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని 23 గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. సాయికుమార్, మనిరాజ్, కోటయ్య, మజ్జి కృష్ణను అరెస్ట్ చేయగా పాండురెడ్డి, ఎన్. రమేశ్, ప్రకాశ్, రమేశ్ పరారయ్యారని సీపీ తెలిపారు. పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న పోలీస్ అధికారులను సీపీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, ఎస్బీ ఏసీపీ జితేందర్రెడ్డి, నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, ఇన్స్పెక్టర్ సతీశ్ పాల్గొన్నారు.
వివరాలు వెల్లడించిన సీపీ సన్ప్రీత్ సింగ్

గంజాయి పట్టివేత