
ఆదివాసీ సంస్కృతి ప్రకారమే జాతర నిర్వహించాలి
ఎస్ఎస్తాడ్వాయి : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మేడారం జాతర నిర్వహించాలని పూజారులు కోరారు. గత నెల 3వ తేదీన రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజారామయ్యర్, మంత్రి సీతక్క మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం మాస్టర్ ప్లాన్లోని శాశ్వత నిర్మాణాలను పరిశీలించారు. గద్దెల డిజైన్లోని మార్పులు, చేర్పులపై పూజారుల అభిప్రాయాలు స్వీకరించేందుకు వారితో సమావేశం నిర్వహించాలని శైలజారామయ్యార్ ఆదేశించారు. దీంతో మంగళవారం మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహంలో కలెక్టర్ దివాకర్ టీఎస్.. సమ్మక్క, సారలమ్మ పూజారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వనదేవతల గద్దెల డిజైన్పై పూజారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అమ్మవార్ల గద్దెలపై ఎత్తు బంగారం, కొబ్బరి, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం వలన భక్తులకు సంతృప్తి కలుగుతుందని, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల పైకప్పు డిజైన్ తొలగించాలని కలెక్టర్కు వివరించారు. అమ్మవార్ల గద్దెలను యథావిఽధిగా ఉంచాలన్నారు. పూజారుల అభిప్రాయం మేరకు గద్దెల డిజైన్లో మార్పులు, చేర్పులు చేస్తామని కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. మరోసారి ఈనెల 11వ తేదీన సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మేడారంలో శాశ్వత అభివృద్ధి నిర్మాణ పనులకు పూజారులు సహకరించాలన్నారు. సమావేశంలో ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు కొక్కెర రమేశ్, చందా రఘుపతి, కాక సారయ్య, కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన అరుణ్కుమార్, భోజారావు, సిద్ధబోయిన రమేశ్, పూజారులు పాల్గొన్నారు.
ప్రభుత్వాన్ని కోరిన పూజారులు
మేడారం మాస్టర్ ప్లాన్పై సమావేశం
అభిప్రాయాలు వెల్లడించిన పూజారులు