
బీసీలపై రాజకీయ పార్టీల చిన్నచూపు
కాజీపేట రూరల్ : బీసీలను అన్ని రాజకీయ పార్టీలు చిన్న చూపు చూస్తున్నాయని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు వాటా ఇచ్చే వరకూ అవిశ్రాంత పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ వైష్ణవిగ్రాండ్ హోటల్లో శనివారం బీసీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ అధ్యక్షతన ‘స్థానిక సంస్థల ఎన్నికలు–బీసీల రిజర్వేషన్ల పెంపు’ అనే అంశం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. నెల రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించి ఎన్నికల సంఘానికి నివేదించాలని హైకోర్టు ఆదేశించిన ప్రభుత్వం ఇంకా చర్యలు చేపట్టడం లేదన్నారు. బీజేపీ నాయకులు గల్లీలో ఒక మాట, ఢిల్లీలో మరోమాటతో బీసీలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బీసీల వ్యతిరేక పార్టీ అని, కాంగ్రెస్, బీజేపీ మాత్రమే రిజర్వేషన్లు తేల్చాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా సీఎం రేవంత్రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదం ఎత్తుకున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి 42 శాతం బీసీ బిల్లు ఆమోదింపజేయాలని, లేనిపక్షంలో తెలంగాణలో బీజేపీని మట్టి కరిపిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి మల్లయ్యయాదవ్, బీసీ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు డాక్టర్ చిర్ర రాజు, తమ్మేలా శోభారాణి, మాదం పద్మజాదేవి, కాసగాని అశోక్గౌడ్, డాక్టర్ సంగాని మల్లేశ్వర్, మేముల మహేందర్, వల్లాల జగన్గౌడ్, పంజాల మధు, తెల్ల కిశోర్, తెల్ల సుగుణ, బూర్గుల ప్రమాద, బాబుయాదవ్ పాల్గొన్నారు.
42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలకు పోవాలి
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్