
భూ సమస్యలకు మోక్షం!
సాక్షి, మహబూబాబాద్: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకొచ్చి రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేస్తోంది. తర్వాత నోటీసులు ఇవ్వడం, విచారణ మొదలైన ప్రక్రియలు చేపట్టేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. త్వరగా తమ భూ సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాస్పుస్తకాలు అందజేయాలని రైతులు కోరుతున్నారు.
దరఖాస్తుల వరద..
జిల్లాలో ఎనిమిదేళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా అధికారులు పైలెట్ మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇది సక్సెస్ కావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో జూన్ 3నుంచి 16వ తేదీ వరకు సదస్సులు నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసిన సమస్యల జాబితాతో కూడిన దరఖాస్తు ఫాం తయారు చేసి గ్రామాల్లో పంపిణీ చేశారు. సర్వే నంబర్ మిస్ కావడం, మ్యుటేషన్ పెండింగ్, డీఎస్ పెండింగ్, భూ స్వభావంలో మార్పు, పట్టేదారు వివరాల సరవణ, ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడం, అసైన్డ్ ల్యాండ్, ఓఆర్సీ, వారసత్వం, భూ సేకరణ మొదలైన అంశాలపై దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 39,513 దరఖాస్తులు రాగా.. అధికంగా 2007 వారసత్వ సమస్యలు ఉండగా.. అత్యల్పంగా 38–ఈ సర్టిఫికెట్ సమస్యలు ఉన్నాయి.
మొదలైన కసరత్తు
ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే ప్రక్రియ జిల్లాలో మొదలైంది. 18 మండలాల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేసేందుకు ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ముందుగా ప్రతీ దరఖాస్తుదారుడికి, సమస్యకు కారణమైన వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ తర్వాత విచారణ చేసి అక్కడే గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరిస్తారు. అయితే అత్యధికంగా భూ సర్వేతో ముడిపడి ఉన్న సమస్యలు ఉండడంతో 183 మంది సర్వేయర్లను నియమించి 50రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. సర్వే ద్వారా ఆ భూ సమస్యలను పరిష్కరిస్తారు.
ప్రక్రియ వేగవంతం
భూ భారతి చట్టం అమలు ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతోంది. రెండు మూడు రోజుల్లో నోటీసులు జారీ చేసి, ప్రతీ అంశాన్ని విచారణ చేస్తాం. ఈ విచారణలో రైతుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. భూ భారతి చట్టం ద్వారా నిజమైన భూ యజమానికి మేలు జరుగుతుంది.
–వీరబ్రహ్మచారి, అదనపు కలెక్టర్(రెవెన్యూ)
జిల్లాలో వచ్చిన దరఖాస్తుల వివరాలు
సమస్య వచ్చిన దరఖాస్తులు
సర్వే నంబర్ మిస్సింగ్ 1,476
పెండింగ్ మ్యుటేషన్ 384
డీఎస్ పెండింగ్ 1,148
విస్తీర్ణం సవరణ 1,632
భూ స్వభావంపై 263
పట్టేదారు పేర్ల సవరణ 225
ప్రొహిబిటెడ్ జాబితా నుంచి
తీసివేయడం 462
ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడం 02
అసైన్డ్ భూ సమస్య 1,378
ఓఆర్సీ ఇష్యూ కానివి 45
38–ఈ సర్టిఫికెట్ రాకపోవడం 06
వారసత్వ సమస్య 2,007
భూ సేకరణ సమస్య 169
ఇతర సమస్యలు 30,316
మొత్తం దరఖాస్తులు 39,513
ఆన్లైన్లో భూ భారతి దరఖాస్తుల
వివరాలు నమోదు
రెవెన్యూ సదస్సుల్లో
39,513 అర్జీల స్వీకరణ
ముందుగా నోటీసులు జారీ
తర్వాత విచారణ, అవసరమైతే
భూ సర్వే ద్వారా పరిష్కారం

భూ సమస్యలకు మోక్షం!