
కర్రతో విద్యుత్ తీగలు కదిలిస్తుండగా..
● మెయిన్లైన్ నుంచి ఊడి మీదపడడంతో యువకుడు మృతి
● దస్తగిరిపల్లిలో ఘటన
నల్లబెల్లి: కర్రతో విద్యుత్ తీగలు కదిలిస్తుండగా మూడు తీగల్లో (త్రీఫేస్) ఒకటి మెయిన్లైన్ నుంచి ఊడి మీదపడడంతో షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దస్తగిరిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మందాటి లక్ష్మణ్ రెడ్డి(18) ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు. చదువుకుంటూనే వ్యవసాయ పనుల్లో కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం వ్యవసాయ భూమికి నీరు పారించడానికి వెళ్లాడు. విద్యుత్ మోటారు ఆన్ చేయగా నడవకపోవడంతో తీగలను కర్రతో కదిలిస్తున్నాడు. ఈ క్రమంలో మూడు తీగల్లో ఒకటి మెయిన్ లైన్ నుంచి ఊడి మీద పడడంతో షాక్కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.