
సౌర విద్యుత్కు ప్రోత్సాహం..
హన్మకొండ: దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడంతోపాటు నివాస గృహాలు తమ సొంత విద్యుత్ను ఉత్పత్తి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం’ తీసుకొచ్చింది. రూ.75,021 కోట్లతో చేపట్టిన ఈ పథకాన్ని 2026–2027 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు తమ పరిధిలో ఇళ్ల పైకప్పుపై సౌర విద్యుత్ ఉత్పత్తి సాధించేందుకు కృషి చేస్తున్నాయి. విద్యుత్ వినియోగదారులు సౌరశక్తిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సాయం అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా నెట్ మీటర్ల ఏర్పాటు, ఇన్స్టాలేషన్ను సులభతరం చేశాయి. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో ఇప్పటి వరకు 3,925 మంది విద్యుత్ వినియోగదారులు 14,014.77 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇంటిపై కప్పుపై ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ను గృహ అవసరాలకు వినియోగించుకుకోవడం ద్వారా విద్యుత్ బిల్లుల భారం నుంచి విముక్తి పొందడంతో పాటు మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి (డిస్కంలకు) విక్రయించి ఆదాయం పొందొచ్చు. సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం, పర్యావరణ హిత విద్యుత్ను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
రాయితీ మూడు కిలో వాట్ల వరకు పరిమితం
ఈ పథకంలో 2 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు యూనిట్ ఖర్చులో 60 శాతం, 2 నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుకు 40 శాతం రాయితీ అందిస్తున్నారు. 3 కిలో వాట్ల సామర్థ్యం తర్వాత ఎలాంటి రాయితీ లేదు. రాయితీ మూడు కిలో వాట్ల వరకు పరిమితం చేశారు. ప్రస్తుతమున్న ధరల ప్రకారం కిలో వాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సోలార్ యూనిట్ ఏర్పాటుకు రూ.85,550 అవుతుంది. ఇందులో ప్రభుత్వం రూ.30 వేల రాయితీ అందిస్తుండగా, వినియోగదారుడు 55,500 చెల్లించాలి. 2 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటునకు రూ.1,46,500 ఖర్చు అవుతుంది. 3 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటునకు రూ.2,08,900 ఖర్చు అవుతుంది. 2 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్కు ప్రభుత్వం రూ.60 వేల రాయితీ అందిస్తుంది. వినియోగదారులు రూ.86 వేలు భరించాలి. మూడు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్కు ప్రభుత్వం రూ.78 వేల రాయితీ అందిస్తుండగా, వినియోగదారుడు రూ.1,30, 900 భరించాలి. మూడు కిలో వాట్ల పైగా సోలార్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసుకునే వారికి రూ.78 వేల రాయితీ అందిస్తుంది. మిగతా ఖర్చులు వినియోగదారులు భరించాల్సి ఉంటుంది. విద్యుత్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతీ వినియోగదారుడు ఈ సోలార్ యూనిట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటిపై కప్పు సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉండాలి. కిలోవాట్ సోలార్ యూనిట్ ఏర్పాటు ద్వారా నాలుగున్నర యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మూడు కిలో వాట్ల సోలార్ ప్యానళ్ల ద్వారా 15 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మిగులు విద్యుత్ను డిస్కంలకు విక్రయించడం ద్వారా యూనిట్కు రూ.5.25 చొప్పున ఆదాయాన్ని పొందొచ్చు.
గృహ వినియోగదారులకు రాయితీపై సోలార్ ప్లాంట్
ఇంటి పైకప్పుపై ఏర్పాటుకు
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం
పీఎం సూర్యఘర్ పథకం
ద్వారా సబ్సిడీ
టీజీఎన్పీడీసీఎల్లో ఇప్పటి వరకు 3,925 మంది వినియోగదారులు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు
మార్చి 2027 వరకు దేశంలో కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజనతో ప్రయోజనాలు
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజనతో విద్యుత్ వినియోగదారులతో అనేక ప్రయోజనాలున్నాయి. పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా భవిష్యత్కు మేలు చేసినట్లు అవుతుంది. ప్రధానంగా కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. విద్యుత్ బిల్లుల బాధ తప్పుతుంది. ప్రభుత్వం రాయితీ ఇస్తున్న నేపథ్యంలో సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ఖర్చు తక్కువవుతుంది.
కె.గౌతం రెడ్డి, ఎస్ఈ, వరంగల్
సర్కిళ్ల వారీగా ఇలా..
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఆదిలాబాద్ సర్కిల్లో 331 మంది వినియోగదారులు 1191.67 కిలో వాట్ల సామర్థ్యమున్న సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆసిఫాబాద్లో 21 మంది 75 కిలో వాట్లు, భూపాలపల్లిలో 19 మంది 62 కిలో వాట్లు, హనుమకొండలో 622 మంది 2123.8 కిలో వాట్లు, జగిత్యాలలో 65 మంది 238 కిలో వాట్లు, కామారెడ్డిలో 65 మంది 240.95 కిలో వాట్లు, కరీంనగర్లో 491 మంది 1840.23 కిలో వాట్లు, ఖమ్మంలో 715 మంది 2544.66 కిలో వాట్లు, కొత్తగూడెంలో 441 మంది 1582.82 కిలో వాట్లు, మహబూబాబాద్లో 81 మంది 289.5 కిలో వాట్లు, మంచిర్యాలలో 137 మంది 434.45 కిల వాట్లు, నిర్మల్లో 79 మంది 270.5 కిలో వాట్లు, నిజామాబాద్లో 486 మంది 1795.99 కిలో వాట్లు, పెద్దపల్లిలో 108 మంది 390.3 కిలో వాట్లు, వరంగల్ సర్కిల్లో 219 మంది వినియోగదారులు 791.9 కిలో వాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
సోలార్ ప్యానెళ్లు సూర్యశక్తిని నేరుగా విద్యుత్ శక్తిగా మారుస్తాయి
సోలార్ ప్యానళ్ల సూర్యశక్తి ని నేరుగా విద్యుత్ శక్తిగా మారుస్తాయి. సౌర ఫలకాలు ఫొటోవోల్టాయిక్ ప్రభావం ద్వారా సూర్యరశ్మిని నేరుగా విద్యుత్గా మారుస్తాయి. సోలార్ ప్యానళ్లను ఇంటి పైకప్పుపై బిగించుకుని సులువుగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆ విద్యుత్ను ఇంటి అవసరాలకు వాడుకోవడంతో పాటు మిగులు విద్యుత్ డిస్కంలకు విక్రయించడం ద్వారా ఆదాయం పొందొచ్చు.
పి.మధుసూదన్రావు, ఎస్ఈ ,
హనుమకొండ

సౌర విద్యుత్కు ప్రోత్సాహం..

సౌర విద్యుత్కు ప్రోత్సాహం..