
పొదుపు.. భవిష్యత్కు మలుపు
కాజీపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)ను గతంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే అనుకునేవారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్వావలంబన్ పథకం’కు గృహిణి నుంచి కూలీ పని చేసుకునే ప్రతి ఒక్కరూ అర్హులు. ఈ పథకంలో చేరడం వల్ల వృద్ధాప్యంలో పెన్షన్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుత రోజూవారీ ఖర్చులను అధిగమించడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో సంపాదించే వయసులోనే ఎలాంటి పొదుపు చేకుండా ఉంటే వృద్ధాప్యంలో ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎంతో మంది వృద్ధ తల్లిదండ్రులను జీవిత చరమాంకంలో కొడుకులు పట్టించుకోకపోవడం ప్రస్తుతం చూస్తున్నాం. ఆసరా కరువై.. పనిచేసే శక్తిలేక.. ఆర్థిక అండ కరువై ఎంతోమంది వృద్ధులు దుర్భరంగా బతుకుతున్నారు. వయసు పెరగడంతో పాటు జీవన వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆర్థికంగా స్వాతంత్య్రం ఉండాలి. అందుకే ‘స్వావలంబన్’ యోజన పథకంలో చేరితే చక్కటి ఫలితంగా ఉంటుంది. వయసులో ఉన్న సమయంలో చేసిన పొదుపు.. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవించేందుకు అవకాశం కల్పిస్తుంది.
పింఛన్ ఇలా పొందుతారు..
ఖాతాదారుడి వయస్సు 60 ఏళ్ల నిండిన వెంటనే తాము జమచేసిన డబ్బు మొత్తం 60 శాతం నగదును ఒకేమారు చెల్లిస్తారు. మిగతా 40శాతం వారి ఖాతాలో అలాగే ఉంచి, దానిపై వచ్చే రాబడిని జీవితాంతం ప్రతీనెలా పింఛన్ రూపంలో చెల్లిస్తారు. ఖాతాదారుడు మరణిస్తే అప్పటివరకు ఖాతాలో పొదుపు చేసిన మొత్తం నిధిని వారి నామినీకి అందిస్తారు. 60 ఏళ్ల తర్వాత పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఖాతాలో నిల్వ ఉన్న 40శాతం సొమ్మును కూడా వారికే అందజేస్తారు. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మండలస్థాయి కోఆర్డినేటర్లను నియమించినా ఆశించిన ఫలితాలు రావడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ పథకానికి సరైన ప్రచారం చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది. టోల్ఫ్రీ నంబర్ 1800–110708కు ఫోన్చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
‘స్వావలంబన్ యోజనతో’ వృద్ధాప్యంలో ఆర్థిక అండ
18 నుంచి 60 ఏళ్ల వారు అర్హులు
కేంద్ర ప్రభుత్వ పథకంతో భవిష్యత్కు ఆర్థిక ధీమా
స్వావలంబన్తో ప్రయోజనాలు..
వృద్ధాప్యంలో పింఛన్ అందజేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 18 నుంచి 60 ఏళ్ల వయసున్న భారతీయ పౌరులందరూ ఈ ఖాతాను తెరిచేందుకు అర్హులు. ప్రతీ పౌరుడు ఏడాదిలో కనీసం రూ.వెయ్యి నుంచి రూ. 2వేలకు తగ్గకుండా పొదుపు చేయాలి. ప్రభుత్వం ఏటా రూ.600 కలుపుతుంది. ప్రతీ ఖాతాదారుడికి ఫొటోతో పాటు పాన్కార్డు (పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్)ను ఇస్తుంది. ఈ కార్డుతో ఎన్పీఎస్లో సభ్యత్వం ఉన్నట్లు గుర్తించొచ్చు. ఖాతా తెరిచిన 45 రోజుల్లో ఈ కార్డును పొందొచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వావలంబన్ యోజన పథకం’ వృద్ధాప్యంలో ఆర్థికంగా అండగా నిలవనుంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి దేశంలోని సామాన్యులు సైతం 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ పొందేందుకు కేంద్రం ఈ అవకాశం కల్పించింది. బడుగు, బలహీన వర్గాల వారితోపాటు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లు, ఇతర ప్రైవేట్ ఉద్యోగులు, చిన్న,పెద్ద వ్యాపారులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. వయసులో చేసిన పొదుపు.. వృద్ధాప్యంలో అండగా నిలవనుంది.
స్వావలంబన్ యోజన విశిష్టత..
ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా దేశంలోని సామాన్యులు కూడా 60 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్ పొందేందుకు కేంద్రప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా 2009లో ‘జాతీయ పెన్షన్ స్వావలంబన్ యోజన పథకం’ను ప్రారంభించింది.

పొదుపు.. భవిష్యత్కు మలుపు