
రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల్లో జాప్యం
● మానుకోట రైల్వేస్టేషన్లో కొనసాగుతున్న
ఆధునికీకరణ పనులు
● ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
● పనులు త్వరగా పూర్తిచేయాలని డిమాండ్
ఎల్సీ గేటు సమీపంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు
మహబూబాబాద్ రూరల్:
రైల్వే మూడో లైన్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులతో పాటు మానుకోట రైల్వే స్టేషన్ పరిధిలో చేపడుతున్న ఆధునికీకరణ పనుల్లో జాప్యం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాగా రైల్వే అధికారులు పర్యవేక్షిస్తున్నప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు నెమ్మదిగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైల్వేస్టేషన్లో ప్రయాణికుల అవస్థలు..
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్ ఫారం వైపున కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకుండానే రైల్వే మూడోలైన్ పనులు మొ దలుపెట్టారు. రెండు నెలల క్రితం ఇక్కడ ఉన్న బుకింగ్ కౌంటర్ను కూల్చివేసి రైల్వే లైన్ నిర్మాణం కోసం తవ్వకాలు జరిపారు. అనంతరం చేపట్టిన పనులు నత్తనడకన జరుగుతున్నాయి. కాగా ప్ర యాణికులు వచ్చి, వెళ్లేందుకు ఎలాంటి ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయలేదు. దీంతో రైళ్లు వచ్చి వెళ్లేటప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే లైన్ సైడ్ వాల్ ఒక ప్రాంతంలో కొంత మేరకు తొలగించి వదిలివేయడంతో ప్రయాణికులు అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఒకేసారి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్రయాణికుల రద్దీ వల్ల ఆ దారిగుండా వెళ్లలేకపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రయాణికుల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టాలని, జరుగుతున్న పనుల్లో పురోగతి పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారి పరిశీలన..
రైల్వే అధికారుల మధ్య సమన్వయలోపం వల్ల కూడా పనుల్లో పురోగతి కనిపించడం లేదని తెలుస్తోంది. ఇటీవల రైల్వేశాఖ నిర్మాణ పనుల విభాగం డిప్యూటీ సీఈ రామారావు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావుతో కలిసి రైల్వే మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రయాణికులకు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈపీసీ కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ నెల 23నుంచి 30వ తేదీ వరకు నాన్ ఇంటర్ లాకింగ్ పనులు ఉన్నందువల్ల మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో మూడో లైన్ నిర్మాణ పనుల పురోగతి పెంచాలన్నారు.
గేటు మూసివేతతో ఇబ్బందులు..
రైల్వే ఎల్సీ–80 నంబర్ గేటు వద్ద మూడో లైన్ నిర్మాణ పనుల కోసం పలుమార్లు ఆ గేటును మూపివేశారు. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మూడో లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా కల్వర్టుల వద్ద బ్రిడ్జిల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైల్వే ఎల్సీ 80 నంబర్ గేటు వద్ద కేబుల్ వైర్లు తెగిపోవడం వల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది.

రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల్లో జాప్యం

రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల్లో జాప్యం