
ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
గార్ల: రాజీవ్ యువ వికాసం అర్హుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ జి.దేశీరాంనాయక్ మండల అధికారులను ఆదేశించారు. శుక్రవారం గార్ల ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా దరఖాస్తులు ఎన్ని వచ్చాయి? సిబిల్ స్కోర్ కోసం బ్యాంకుకు ఎన్ని దరఖాస్తులు పంపారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కమిటీ అర్హులను గుర్తించి జాబితాను జిల్లా కమిటీకి పంపించాలని సూచించారు. జిల్లా కమిటీ జాబితాను స్క్రూటినీ చేసి అర్హులను గుర్తించి పథకానికి ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. డీడీ వెంట సూపరింటెండెంట్ ఉషశ్రీ, ఎంపీఓ కవిత, ఎస్సీఆర్పీలు ఎం.బుచ్చానాయక్, బి.భద్రునాయక్ పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం
మహబూబాబాద్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేశామని యాసంగి 2024–25కు గాను ఈనె నెల 8 వరకు 75,384,981 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్లు డీసీఎస్ఓ ప్రేమ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 62,941,826 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించినట్లు పేర్కొన్నారు.
యుద్ధానికి బయల్దేరిన జవాన్
బయ్యారం: భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో సెలవులపై స్వగ్రామానికి వచ్చిన జవాన్ శుక్రవారం ఉద్యోగ స్థానానికి బయల్దేరాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బయ్యారానికి చెందిన షేక్ అజహర్ ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్లో పాల్గొని నాలుగు రోజుల క్రితం సెలవుపై స్వస్థలానికి వచ్చాడు. ఉదంపూర్ సెక్టార్లో ప్రస్తుతం ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విధుల్లో చేరేందుకు వెళ్లాడు.
శాస్త్రోక్తంగా గరుడాదివాసం
మంగపేట: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో (జాతర) రెండోరోజు గరుడాదివాసం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం ఆలయ ప్రాంగణంలోని దైత అమ్మవారికి తిరుమంజనం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వేద మంత్రోచ్ఛారణతో కుంకుమ, చందనం, జలం, పాలతో అభిషేక పూజలు నిర్వహించి అమ్మవారికి నూతన పట్టువస్త్రాలతో అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపించారు. సాయంత్రం యాగశాలలో గరుడాదివాసం కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6 నుంచి గరుడపఠ లేకనం లిఖించి పూజలు చేశారు. ఎస్సై టీవీఆర్ సూరి, ఆలయ బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి

ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి