
‘కాళేశ్వరం’ అప్పుడు.. ఇప్పుడు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం 1975కు పూర్వం శిధిలావస్థలో ఉండేది. అప్పటి వరకు కీకర దండకారణ్యం కావడంతో కాకులు దూరని కారడవిగా ఉండే ఆలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అప్పటి రవాణాశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు ప్రత్యేక చొరవ తీసుకొని జీర్ణోద్దరణ కమిటీ వేసి పనులు ప్రారంభించారు. కమిటీలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, అప్పటి కలెక్టర్ ఇతరులు సభ్యులుగా ఉన్నారు. రోడ్డు, రవాణా, విద్యుత్, కనీస అవసర సదుపాయాలు కల్పించారు. 1982లో శృంగేరి శారద పీఠాధిపతులు విద్యాతీర్థమహాస్వామి, భారతీతీర్ధస్వామి చేతుల మీదుగా కుంభాభిషేకం చేసి జీర్ణోద్దరణ జరిపారు. తర్వాత దేవస్థానం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అనేక మార్పులు సంతరించుకున్నాయి. నాడు పదుల సంఖ్యలో వచ్చే భక్తులు.. ప్రస్తుతం వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం దేవాలయం వార్షికాదాయం రూ.6 కోట్లకు చేరింది. రోడ్డు, రవాణా, అంతర్రాష్ట్ర వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది. దేవస్థానం దేశవ్యాప్తంగా కీర్తి పొందుతూ ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2016లో అప్పటి సీఎం కేసీఆర్ రూ.25 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం సరస్వతీనది పుష్కరాల నేపథ్యంలో రూ.25కోట్ల వరకు నిధులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక దృిష్టితో నిధులు మంజూరు చేయగా పనులు జరుగుతున్నాయి. ఈనెల 15 నుంచి 26 వరకు సరస్వతీనది పుష్కరాలను ప్రభుత్వం నిర్వహించనుంది. పుష్కరాల ప్రారంభానికి సీఎం రేవంత్రెడ్డి రానున్నారు. త్రివేణి సంఘమైన(గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణిగా సరస్వతీనది) కాళేశ్వరంలో 12ఏళ్లకోసారి ఒక్కో నదికి పుష్కరాలు నిర్వహిస్తుంటారు.

‘కాళేశ్వరం’ అప్పుడు.. ఇప్పుడు