
వడదెబ్బతో ఇద్దరు మృతి
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కాంటా వేస్తున్న హమాలీ కార్మికుడు శివరాత్రి శ్రీనివాస్ (35) వడదెబ్బతో మృతి చెందాడు. వర్ధన్నపేట మండలం సాగరం గ్రామానికి చెందిన శ్రీనివాస్ వరంగల్లోని సుందరయ్యనగర్లో నివాసం ఉంటూ.. మార్కెట్లో హమాలీగా పనిచేస్తున్నాడు. గురువారం శ్రీనివాస్ యథావిధిగా పసుపు యార్డులోని గజేంద్ర అడ్తికి వచ్చిన మిర్చి బస్తాలను తూకం వేస్తున్న క్రమంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తోటి కార్మికులు ప్రథమ చికిత్స చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో మార్కెట్లోని అంబులెన్స్కు ఫోన్ చేశారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లుగా కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. శ్రీనివాస్ మృతిపై మార్కెట్ అధికారులు, కార్మికులు, వ్యాపారులు, సుందరయ్యనగర్ వాసులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
భూపాలపల్లి జిల్లాలో రైతు..
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలీటీ పరిధి కాసీంపల్లి గ్రామానికి చెందిన రైతు చిత్తారి చిన్నరాజయ్య (68) గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. చిన్నరాజయ్య బుధవారం వరి ధాన్యం కోసేందుకు పనికి వెళ్లాడు. సాయంత్రం అస్వస్థకు గురవగా.. కుటుంబ సభ్యులు భూపాలపల్లిలోనిఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన గురువారం సాయంత్రం మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఎండ తీవ్రత పెరిగిన కారణంగా వడదెబ్బ బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఆదివారం వడదెబ్బ కారణంగా ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

వడదెబ్బతో ఇద్దరు మృతి