
రోస్టర్ పద్ధతిలో పుష్కర విధులు
భూపాలపల్లి: సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణకు డ్యూటీ రోస్టర్ తయారు చేస్తున్నట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం సరస్వతి పుష్కరాల విధులు, పనుల పర్యవేక్షణపై రెవెన్యూ, పంచాయతీరాజ్, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పుష్కరాలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డి వస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్లు ప్రొటోకాల్ విధులు, ఎంపీడీఓలు పారిశుద్ధ్య విధుల పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఘాట్ వద్ద రెండు రోజుల్లో మొత్తం పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి పరిశుభ్రం చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చూసుకోవాలన్నారు. పుష్కర విధులు కేటాయించిన అధికారులు శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. సమయం తక్కువగా ఉందని పనులు, ఏర్పాట్లు ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. సరస్వతీ మాత విగ్రహం ప్రారంభోత్సవం, భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరికల బోర్డులు, ఉచిత అన్నదానం.. ఇలా ప్రతీ అంశాన్ని పర్యవేక్షించేందుకు నియమించిన అధికారులు శుక్రవారం నుంచి పటిష్ట పర్యవేక్షణ చేయాలని, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెలి కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఆర్డీఓ రవి, అన్ని శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ
అధికారులతో టెలికాన్ఫరెన్స్