
దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తా..
● శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్
హన్మకొండ కల్చరల్ : విశ్వాబ్రాహ్మణ సామాజిక వర్గ ప్రజల అభ్యున్నతికి, దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకా్శ హామీ ఇచ్చారు. బుధవారం హనుమకొండ భద్రకాళి రోడ్లోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం శ్రీగాయత్రిమాత, శివాలయంలో ఉదయం 6గంటల నుంచి సుప్రభాత సేవలు నిర్వహించారు. అనంతరం అర్చకులు గుటోజు కేదారీశ్వరాచారి బ్రహ్మంగారి మూలమూర్తికి పంచామృతాభిషేకం, మేలుకొలుపు, పూజలు చేశారు. తర్వాత దేవాలయంలో వివిధ పుష్పాలతో వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రపటాన్ని ప్రతిష్ఠించి ఆవాహన, గణపతిపూజ, నవగ్రహపూజ, మంటపారాధన, ఆరాధనపూజ నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు మారేడోజు సదానందాచారి, కార్యదర్శి జల్లిపెల్లి పెంటయ్యచారి అధ్యక్షతన జరిగిన పూజ కార్యక్రమంలో బండా ప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అనసూరి చంద్రమౌళి, వేల్పుల దేవాచారి, పెందోట చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.